కలిసి పనిచేద్దాం

ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేయాలని నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. నీతి ఆయోగ్‌ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం మంగళవారం

కలిసి పనిచేద్దాం
  • నీతిఆయోగ్‌, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • పలు అంశాను వివరించిన సీఎం రేవంత్‌
  • పరిష్కారానికి నీతిఆయోగ్‌ హామీ
  • రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చ

విధాత : ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేయాలని నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. నీతి ఆయోగ్‌ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం మంగళవారం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో సమావేశమైంది. రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చించారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.


రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా సహకారమందిస్తామని నీతిఆయోగ్‌ బృందం హామీ ఇచ్చింది. కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికిచ్చే నిధులు, వనరుల మంజూరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల కేటాయింపు పెరిగేలా చూడాలని కోరారు. ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.1800 కోట్ల నిధుల విడుదల గురించి నీతి ఆయోగ్‌ అధికారులతో చర్చించారు.


వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని ఉభయులు అంగీకరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్ సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్సెస్‌ తదితర అంశాలపైనా చర్చలు జరిగాయి. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడంపై రాష్ట్రానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర సామర్ధ్యాలను పటిష్టం చేయడానికి గాను స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్ఐటి) ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై సమావేశం చర్చించింది. అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలతో పీపీపీ మోడల్ ద్వారా సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే వంటి ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ రివర్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ బృందానికి విజ్ఞప్తి చేశారు.


హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని భాగస్వామ్యంతో కలసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని నీతి ఆయోగ్ కోరింది. నిర్మాణాత్మక మద్దతు, సహకారం నీతి ఆయోగ్ కు అందిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్, మెంబెర్ విజయ కుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేష్ డాష్, ముత్తు కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.