Ponguleti Srinivas Reddy | 3నెలల్లో ఎల్ఆరెస్ ప్రక్రియ పూర్తి చేయాలి.. అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు
3నెలల్లో ఎల్ఆరెస్ ప్రక్రియ పూర్తి చేయాలి.. అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు

25లక్షల పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
విధాత, హైదరాబాద్ : ఎల్ఆరెస్ ఫ్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న 25.70లక్షల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్లను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆరెస్పై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని, నిబంధనలకు లోబడి దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించండని ఆదేశించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎల్ఆరెస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆరెస్ దరఖాస్తులను తీసుకుందన్నారు. అప్పట్లో 25.70లక్షల దరఖాస్తులు రాగా అందులో హెచ్ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అధారిటి పరిధిలో 1.35 లక్షలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ దరఖాస్తుదారులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని, వీటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావులేకుండా ఎల్ఆరెస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అప్లికేషన్ల పరిష్కారానికి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
ఎల్ఆరెస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. క్రమబద్దీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎల్ఆరెస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణ తక్షణమే చేపట్టాలన్నారు. ఎల్ఆరెస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్ లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళికాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. ఆమోదించబడిన లేఅవుట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సహాయపడుతుందన్నారు.