ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి వివాహ వ్యవస్థపై గౌరవం లేదని, తాళి విలువ తెలియదని ఎద్దేవా చేశారు.
వివాహ వ్యవస్థపై గౌరవం లేని ప్రధాని
అబద్ధాలకోరు మోదీని ఇంటికి పంపాలి
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలను గెలిపించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
విధాత బ్యూరో, కరీంనగర్: ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి వివాహ వ్యవస్థపై గౌరవం లేదని, తాళి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. తాళి కట్టిన భార్యను వదిలేసినోడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, అతడిని మించిన అబద్ధాలకోరు మరొకరులేరని విమర్శించారు. గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజలను వంచించిన అబద్ధాలకోరు నరేంద్ర మోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో సీపీఐ గ్రామ, మండల శాఖల కార్యదర్శులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల ముఖ్య నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశానికి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని, హిందువులు, మైనార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపి నేతలు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దళితులపై, మైనార్టీలపై, మేధావులపై దాడులు, హత్యలు జరిగాయని, అనేకమంది మేధావులను నిర్బంధించి జైల్లో పెట్టిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు.
పదేళ్ల మోదీ పాలనలో ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో సామాన్యులపై భారం పడిందని చెప్పారు. పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో మోదీ విఫలమయ్యారని స్పష్టంచేశార. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అభివృద్ధి పనులు చేపట్టని బండి సంజయ్ కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ పయనం ఎటువైపు ఉంటుందో ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లమవతుందన్నారు. పదేళ్ల పాలనలో మోదీ అనుసరించిన విధానాలతో దేశ ప్రగతి తిరోగమనంలో ఉందని విమర్శించారు. ఈసారి కూడా మోదీ అధికారంలోకి వస్తే మనువాద సిద్ధాంతాన్ని, ఆర్ ఎస్ ఎస్ ఎజెండాను అమలు చేస్తూ మత వైషమ్యాలు రెచ్చగొడుతారని హెచ్చరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే కుల గణన జరిగితీరుతుందని, తద్వారా ఆయా కులాలకు రిజర్వేషన్ల ప్రకారం మేలు చేకూరుతుందన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మతసామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. మతతత్వ బీజేపీకి మళ్లీ అధికారం కట్టబెడితే దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లిపోతాయని,మారణ హోమాలు నిత్యకృత్యంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దుపర్చాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ఎంపీ లాడ్స్ కింద బండికి రూ.25 కోట్లు మంజూరు కాగా, 5 కోట్లు మాత్రమే అభివృద్ధి పనులకు వెచ్చించారని, మిగిలిన 20 కోట్లు మురిగిపోయాయని రాజేందర్ రావు ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జిల్లాల సీపీఐ కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, కర్రె బిక్షపతి, గుంటి వేణు, వెన్న సురేష్, తాండ్ర సదానందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, గడిపే మల్లేష్, ఆదరి శ్రీనివాస్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి లతోపాటు వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.