రైతు భరోసా సహాయం పంపిణీకి ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈ బడ్జెట్ లోనే రైతుభరోసాకు నిధులు కేటాయించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
విధాత, హైదరాబాద్ : రైతు భరోసా సహాయం పంపిణీకి ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈ బడ్జెట్ లోనే రైతుభరోసాకు నిధులు కేటాయించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతుభరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, కమిటీ సభ్యులు భట్టి విక్రమార్కతో పాటు సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు హాజరయ్యారు. తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకీ పంచుతుందని స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని ఇచ్చి హామీని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నదని చెప్పారు. రైతు భరోసాపై రైతుల ఆలోచన ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటోందన్నారు. అందుకే రైతుల నుంచి వచ్చే ప్రతిసూచనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.