మైనింగ్లో అక్రమాలకు సంబంధించి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్రెడ్డిలపై ఈడీ విచారణలో భాగంగా బుధవారం సైతం సోదాలు కొనసాగించారు
విధాత, హైదరాబాద్ : మైనింగ్లో అక్రమాలకు సంబంధించి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్రెడ్డిలపై ఈడీ విచారణలో భాగంగా బుధవారం సైతం సోదాలు కొనసాగించారు. ఈడీ విచారణకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హాజరయ్యారు. ఆయనను విచారించిన ఈడీ అధికారులు పటాన్ చెరులోని యాక్సెస్ బ్యాంకులో మహిపాల్రెడ్డి లాకర్లు తెరిచి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేర్లతో ఉన్న పలు పత్రాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. గత నెల 20న మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు రావాల్సిందిగా ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా ఆ మరుసటి రోజే బ్యాంకు లావాదేవీలు, లాకర్లపై ఈడీ ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది. అయితే పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తూ, నిధుల మళ్లింపుకు పాల్పడుతూ ప్రభుత్వానికి దాదాపు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లేలా చేశారన్న ఫిర్యాదులపై ఈడీ విచారణ కొనసాగిస్తుంది.