దేశానికి మోదీ పాలనే శ్రీరామ రక్ష అని, మల్కాజిగిరి ప్రజలు బీజేపీని గెలిపించడం ద్వారా దేశ ప్రగతికి మద్దతుగా నిలవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోరారు.
విధాత, హైదరాబాద్ : దేశానికి మోదీ పాలనే శ్రీరామ రక్ష అని, మల్కాజిగిరి ప్రజలు బీజేపీని గెలిపించడం ద్వారా దేశ ప్రగతికి మద్దతుగా నిలవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోరారు. గురువారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో ఈటల రాజేందర్ పాల్గొని మోదీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మోదీకి ఓటు ఎందుకు వేయాలో వీర సైనికుడు అభినందన్ తల్లిని అడగాలని, ఇస్రో శాస్త్రవేత్తలను అడగాలని, టాయిలెట్లను ఇంటింటికి కట్టించగా వాటిని ఉపయోగిస్తున్న మహిళలను అడగాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఎవరెవరు వేయించుకున్నారో వారిని అడగాలని సూచించారు. దేశంలో16 ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇనిస్ట్యూట్స్ను ప్రారంభించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అవినీతి, అస్థిరత, అశాంతి లేని పదేళ్ల సుస్థిర, సుపరిపాలన మోదీ అందించారన్నారు. 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థను 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారని, మూడోసారి అధికారంలోకి వచ్చాకా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతారన్నారు. 370రద్దు, త్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఒకే దేశం..ఒకే చట్టం కోసం ముందుకెలుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో బాంబు పేలుళ్లు సాగేవని, ఇప్పుడు హైదరాబాద్ సహా దేశమంతా ప్రశాంతంగా ఉందన్నారు.
మోదీ బతికినా చచ్చినా ప్రజల కోసమేనన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని, అబద్ధాలను ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. నిజానికి రాజ్యాంగాన్ని అధికసార్లు సవరించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలో మహిళలకు 2,500ఇస్తామని, రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని, ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఒక ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తూ అది కూడా పాత డొక్కు బస్సులతో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, దానిని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ధరణిపై మౌనం వహిస్తుందని విమర్శించారు. మద్యం తాగించడంలో, అమ్మకాల్లో నెంబర్ వన్ అని, మహిళల పుస్తెలు తెగడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. బోడుప్పల్లో ఓ కార్పొరేటర్ అపార్టెంట్ల మద్యలో వైన్ షాప్ ప్రారంభించారని దానివల్ల అక్కడ నివసిస్తున్నవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నామని, సమస్య తనకు చెప్పుకున్నారన్నారు.
అయితే తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి బీఆరెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయాడని విమర్శించారు. బోడుప్పల్లో నెలకొన్న వక్స్ బోర్డు సమస్య ఎవరు అధికారంలో ఉన్న తీర్చడం లేదని, వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కరిస్తామన్నారు. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో, హాస్టళ్లల్లో సన్న బియ్యం పెట్టమని జీవో ఇచ్చానని గుర్తు చేశారు. కరోనా సమయంలో బాధితుల వద్దకు వెళ్ళి వారికి ధైర్యాన్ని కల్పించి ఎందరో ప్రాణాలు కాపాడానని గుర్తు చేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. దందాల కోసం రాజకీయాలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓటు వేస్తేనే పదవి వస్తుందని, మెరుగైన ప్రజాసేవ కోసం మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కేంద్రంలో రానున్న మోదీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.