లోక్ సభ ఎన్నికల్లో స్వీప్ చేస్తాం.. బీజేపీ నేత ఈటల రాజేందర్‌

తెలంగాణ అసెంబీల్ ఎన్నికల్లో బీజేపీపై ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు తమ పార్టీకి ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు

లోక్ సభ ఎన్నికల్లో స్వీప్ చేస్తాం.. బీజేపీ నేత ఈటల రాజేందర్‌

విధాత : తెలంగాణ అసెంబీల్ ఎన్నికల్లో బీజేపీపై ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు తమ పార్టీకి ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తమ పార్టీపై పెంచుకున్న నమ్మకం నేపధ్యంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆరెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని నిరూపించారన్నారు. 2018లో ఒక సీటు గెలిస్తే 2023లో 8సీట్లు గెలిచామని, 6.97నుంచి 14శాతంకు ఓట్ల శాతం పెరిగిందని, భవిష్యత్తు బీజేపీదేనన్నారు. మోడీ గత తొమ్మిది సంవత్సరాల పాటు భద్రత, భరోసానే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశ గొప్పతనాన్ని చాటిన వ్యక్తి అని కొనియాడారు.


కరోనాను తట్టుకుని ఆర్థిక పురోగతి సాధిస్తున్న దేశం భారత్ దేశం అని చెప్పుకొచ్చారు. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని.. వాటిని ఆదుకున్న ప్రధాని మోడీ అని అన్నారు. మోడీ వచ్చిన తర్వాత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందన్నారు. దేశం బార్డర్‌లో ఇంచు స్థలం కూడా కబ్జా కాకుండా జెండాలు పాతిన వ్యక్తి మోడీ అని కొనియాడారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మిగతా రాష్ట్రాలలో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని ఆరోపించడం విడ్డూరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి నిరాశపరిచిందని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని, పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు.


రేపు పార్లమెంట్‌లో 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు. అయోధ్యలో అందరినీ ఒప్పించి రామాలయం కట్టిస్తున్న వ్యక్తి మోడీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే అని చెప్పుకొచ్చారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.


రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలతో కలిసి కూల్చుతామన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కడియం వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. తమకు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేదని, మునుముందు ఉండబోదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలువాల్సివుండేనని, అయితే ఓటమికి కారణాలు విశ్లేషించుకుని రెట్టింపు ఉత్సాహంతో ప్రజాదరణ సాధిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో స్వీప్ చేస్తామన్నారు.