పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ-బీఆరెస్ కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తున్నాయని, అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసుల డ్రామా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు
విధాత : పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ-బీఆరెస్ కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తున్నాయని, అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసుల డ్రామా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట, సూర్యాపేట మున్సిపాలిటీ మున్సిపల్ పరిధిలో బీఆరెస్ శ్రేణులతో కలిసి జగదీశ్రెడ్డి పలువార్డులలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి బీజేపీకి రేవంత్తో ఒప్పందం లేకుంటే ఫేక్ వీడియో కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైందని, ఎంపీ ఎన్నికల పోరు వన్సైడ్గా బీఆరెస్వైపు మళ్లిందన్నారు. మెజార్టీ సీట్లు బీఆరెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వస్తేనే తమకు శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలే మాకు వివరిస్తున్నారని పేర్కోన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు తోడు దొంగలేనని, వారి సిద్ధాంతాలను రాద్దాంతాలను ప్రజలు గమించి ఎన్నికల హామీలతో చేసిన మోసాలకు ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ , బీజేపీ లోపాయకారి ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ కార్పోరేట్ల పార్టీ అని, ప్రజలను మరింత పేద వాళ్లుగా చేస్తుందని విమర్శించారు.
ప్రజల్లో రాముడి సెంటిమెంటు రగిల్చి పబ్బం గడిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రచారంతో బీఆరెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని మెజార్టీ ఎంపీ సీట్లు బీఆరెస్ గెలవగానే..పార్లమెంట్ ఎన్నికల తర్వాతా రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు తధ్యం అని జోస్యం చెప్పారు.