కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్: మంత్రి హరీష్ రావు

– 31న నారాయణ ఖేడ్ లో కేసీఆర్ సభ
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత చరిత్రను చూస్తే, కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తిగా చెప్పుకోవచ్చని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈనెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పాడన్నారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు.. నోటికి ఏదొస్తే అదే తిట్టిండు,
ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు.. రేవంత్ నోటికి మొక్కాలి అని ఎద్దేవా చేశారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా, బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదని తేల్చారు. మేం ఎవ్వరికీ బీ టీం కాదు, మేం తెలంగాణ ప్రజల టీం అని, బీఆరెస్, బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు అన్నారు. నీళ్ల, నూనె ఎప్పుడైనా కలుస్తాయా? ఇది కూడా అంతే,
కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం లేదనీ చెప్పారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..?
పక్క రాష్టాల్లో చూస్తున్నాం.. వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారన్నారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలసి ఈనెల 30న నారాయణ ఖేడ్ లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై చర్చించారు.