కేసీఆర్‌ ఒంట్లో ఉన్నదంతా మద్యమే.. రక్తమెక్కడిది?

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే మాజీమంత్రి కేటీఆర్‌ను బొక్కలో వేసి ఊచలు లెక్కపెట్టించేవాళ్లమని ఎంపీ బండి సంజయ్

కేసీఆర్‌ ఒంట్లో ఉన్నదంతా మద్యమే.. రక్తమెక్కడిది?
  • తెలంగాణ కోసం కేసీఆర్ రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ ఆగ్రహం
  • కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమే తప్ప రక్తం ఎక్కడిదని ఎద్దేవా

విధాత, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే మాజీమంత్రి కేటీఆర్‌ను బొక్కలో వేసి ఊచలు లెక్కపెట్టించేవాళ్లమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ సహా ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కుమార్ ‘తన తండ్రి రాష్ట్రం కోసం రక్తం చిందించారని’ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘మీ అయ్య ఒంట్లో ఉన్నదంతా మద్యమేనని, రోజు రెండు పెగ్గులు తాగేటోడు ఫుల్ బాటిల్ దంచుతుండేనని, ఏనాడు ప్రగతి భవన్, ఫాంహౌజ్ దాటి రాలేదని, ఇగ రక్తం చిందించిందేప్పుడని?’’అని ప్రశ్నించారు.

ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలేనన్నారు. ‘‘ధాన్యం కొనేటోడు లేక రైతులు కళ్లాల దగ్గర నానా కష్టాలు పడుతుంటే… మేం నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళితే పోలీసులతో కొట్టించారన్నారు, బీఆరెస్‌ గూండాలతో రాళ్ల దాడి చేయించారని, అప్పుడు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించారన్నారు. టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులు అల్లాడుతుంటే వాళ్ల పక్షాన పోరాడిన బీజేపీ కార్యకర్తలను లాఠీలతో కొట్టించారని, 317 జీవో సవరణ కోసం ఉద్యోగుల పక్షాన పోరాడితే కొట్టించి జైల్లో వేశారని, ఆర్టీసీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల పక్షాన పోరాడితే రక్తం చిందేలా కొట్టించారని తెలిపారు. లాఠీదెబ్బలు, రాళ్ల దెబ్బలు తిన్నది మేం. జైళ్లకు పోయింది మేం. రక్తాన్ని చిందించింది మేం. మరి కేసీఆర్ రక్తం చిందించింది ఎక్కడ?’’అని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేటీఆర్ ను జైల్లో వేసి ఊచలు లెక్కించేలా చేసేవాళ్లమన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అక్రమాలు, ప్రజలను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ అరాచకాలు, అవినీతిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడకుండా ఒక్కటంటే ఒక్క పని అయినా చేసిందా? అని వ్యాఖ్యానించారు.