అదనపు ఆదాయానికి వినూత్న మార్గాలు అన్వేషించాలి
అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు

– రవాణా శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం
– ప్రీ బడ్జెట్ పై రవాణా, బీసీ సంక్షేమ అధికారులతో సమీక్ష
– హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
విధాత, హైదరాబాద్: అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహాలక్ష్మి కార్యక్రమం అమలులో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రవాణా శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంకా ఆస్కారం ఉందని, అంతర్గత ఆదాయం, వనరులు పెంపొందించుకునే మార్గాలను కూడా అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
– వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి ఆశించిన మేరకు రాబడులు లేవని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్టీసీ ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, మెట్రోరైలు తరహాలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వివిధ నమూనాలను అధ్యయనం చేయాలని రవాణా శాఖ అధికారులను కోరారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన కోరారు.
– ఆర్టీసీకి కొత్త బస్సులు, రిక్రూట్ మెంట్ల డిమాండ్ : పొన్నం
మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, దీంతో కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు కూడా చేపట్టాలని డిమాండ్ ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, కల్యాణలక్ష్మి, స్కాలర్షిప్లు, వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు ఆర్థిక సహాయం శాఖ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ గురుకులాల సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా, వాటిని మరింత మందికి పెంచాలని కోరారు. కుల వృత్తుల్లో ఉన్నవారికి స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇచ్చేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్రాజు, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బీ వెంకటేశం, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.