కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలతో బ్యారేజీలు కుంగిపోయి ప్రాజెక్టు కోసం రైతులు భూములు, ఇళ్లు ఇచ్చి త్యాగం చేసినా ప్రయోజనం లేకపోయిందని శాసన సభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ఆవేధన వ్యక్తం చేశారు
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలతో బ్యారేజీలు కుంగిపోయి ప్రాజెక్టు కోసం రైతులు భూములు, ఇళ్లు ఇచ్చి త్యాగం చేసినా ప్రయోజనం లేకపోయిందని శాసన సభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ఆవేధన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రాజెక్టులపై స్వలకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ నా నియోజకవర్గం మంథని పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని, వాటి కోసం రైతులు, ప్రజలు తమ భూములు, ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు.
మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రజల సంపద ఎలా వృధా అయిందో తెలుస్తోందన్నారు. బీఆరెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఖజానాను ఏ విధంగా దుర్వినియోగం చేశారనే విషయాలను సభ దృష్టికి తీసుకొస్తున్నామని, వాస్తవాలను చూసేందుకే సభ్యులను అక్కడికి రమ్మంటున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు సహా ఇతర అనేక అంశాల విషయంపై మా ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలు సమీక్ష నిర్వహించారని, దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.
పూర్తిస్తాయిలో అవినీతి జరిగిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని, డ్యామ్ సేఫ్టీ విషయంలో తప్పిదాలు జరిగాయని కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులూ చెప్పారన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 50 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు, డ్యామ్లు ఇప్పటికి నిటారుగా సగర్వంగా నిలబడి రైతులకు, ప్రజలకు సాగుతాగునీరు అందిస్తున్నాయని, దేశంలో కాళేశ్వరం స్థాయిలో ఇంత పెద్ద నష్టం ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఇప్పటిదాక జరగలేదన్నారు. కాళేశ్వరం అవకతవకలపై తామే మాట్లాడితే రాజకీయ విమర్శలు అంటున్నందున వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల సభ్యులనూ మేడిగడ్డకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.