సీతారామం రీడిజైన్తో ప్రజాధనం దుర్వినియోగం
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టగా రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు పెంచి వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

8వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరివ్వలేదు
ఆగస్టు 15 నాటికి 1లక్ష 25వేల ఎకరాలకు గోదావరి నీళ్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉత్తమ్, తుమ్మల, పొంగులేటిలతో కలిసి ప్రాజెక్టు సందర్శన
విధాత : కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టగా రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు పెంచి వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారపల్లి సీతారామ ప్రాజెక్టు పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ వద్ద సాగునీటి అధికారులు ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్ ఫొటో ప్రజెంటేషన్ను తిలకించారు. పంప్ హౌస్ పనులను సైతం పరిశీలించారు. అక్కడి నుంచి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్- 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లై ను ప్రారంభించారు. ఆ తర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్కూర్ లింకు కెనాల్కు రాజీవ్ కెనాల్ గా నామకరణం చేసి, ఆగస్టు 15 నాటికి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు తమ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం అందించనుందని తెలిపారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కు ఎన్ఎఎస్పీఎల్ కెనాల్ కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరి చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చామన్నారు. పంప్స్ ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు.
ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిన కేసీఆర్: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్ను మాజీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం కోలుకోలేని విధంగా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 94000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత బీఆరెస్ ప్రభుత్వం ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. గత బీఆరెస్ సర్కార్ మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేని అసమర్ధత ప్రభుత్వమని విమర్శించారు. 2000 కోట్లతో పూర్తయి రాజీవ్ సాగర్ ను సరైన కారణం లేకుండా సీతారామం పేరుతో రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్థం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గోదావరి నది జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రీడిజైన్ పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి ఆర్థిక భారం మోపినప్పటికీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖలో ఉన్న స్త్రీలను తొలగించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.