బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటి రెడ్డి తాత తరం కూడా కాదు
బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి తాత తరం కూడా కాదని సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు

– తెలంగాణ ఉన్నంత వరకూ గులాబీ జెండా ఉంటుంది
– ప్రజలు పాలన ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదు..
– కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం..
కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు ఉందా?
– పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తాం
– మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి తాత తరం కూడా కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం కాదు.. మీ బాసో, నువ్వో మరో ఏక్ నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు ప్రజలు పాలన ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతారని అన్నారు. కేసీఆర్ వల్లే సాగర్ లో నీళ్ల సమస్య వచ్చింది అంటున్న కోమటి రెడ్డికి అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న ఆయనకు, ఆ పార్టీ నేతలకు కొట్లాడే దమ్ము ఉందా? అంటూ సవాల్ విసిరారు. కృష్ణా జలాల కోసం కొట్లాడింది బీఆర్ఎస్ తప్పా, ఎవరి వల్ల కాలేదు అన్నారు. పాలన చేత కాకుంటే తప్పుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్ళు ఎపుడు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదు అన్నారు. నిరసనలకు మేం తొందరపడటం లేదన్నారు. ప్రజలే సమస్యలపై రోడ్లపైకి వస్తారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేమే మెజారిటీ సీట్లు గెలుస్తామని జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తామని నమ్మకంలేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారన్న ఆయన.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోందని అన్నారు. మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, రాష్ట్రాన్ని నష్టం పరిచే చర్యలు చేయకండి అంటూ హెచ్చరించారు. ఎప్పుడేం మాట్లాడుతారో కోమటి రెడ్డి వెంకటరెడ్డికే తెలియదన్న జగదీశ్ రెడ్డి, నిమిషానికే మాట మార్చే రకం కోమటి రెడ్డి అన్నారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటి రెడ్డి చిన్నా పెద్దా లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కోమటిరెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అభ్యర్థి తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పిన వ్యక్తి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అని అన్నారు.