– నారాయణ పేట కాంగ్రెస్ లోకి వెల్లువలా చేరికలు
– ఉప్పెనలా వస్తున్న ఇతర పార్టీల నేతలు
– పర్ణిక, శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు
– గడ్డు పరిస్థితిలో బీఆర్ఎస్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తాత దివంగత చిట్టెం నర్సిరెడ్డి వారసత్వం… తండ్రి దివంగత చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి రాజకీయ చతురతను అందిపుచ్చుకున్న నారాయణ పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి ప్రచారం లో దూసుకుపోతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆమెకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. ఆమెకు మద్దతుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, అభ్యర్థి మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీగా చేరికలు జరిగాయి. ప్రతి గ్రామంలో పర్ణికను ప్రజలు దీవిస్తుంటే, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గ్రామ సరిహద్దుల వద్ద అడ్డుకుంటున్నారు.
ఆయనకు నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి ఛీత్కారమే ఎదురవుతుండడంతో బీఆరెస్ నాయకులు అయోమయంలో పడ్డారు. రాజేందర్ రెడ్డికి ప్రతి గ్రామంలో నిరసన సెగ తగులుతుండడంతో అర్ధంతంగా తన ప్రచారం ముగించుకుని వెళుతున్నారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికకు గ్రామాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గజ పూల మాలలు, బోనాలు, గంగెరెద్దుల విన్యాసాలు, డప్పులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం మరికల్ మండలంలో పర్ణిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు పేదల బతుకుకు భరోసా ఇస్తాయనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్నారని ఆమె అన్నారు. నారాయణ పేట నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, గత పాలకులు అభివృద్ధిపై దృష్టిపెట్టక పోవడం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నారాయణ పేట నియోజకవర్గం అభివృద్ధి కి పాటుపడతానని పర్ణిక హామీ ఇచ్చారు. కోయిలకొండ మండలంలోని కేశ్వాపూర్, దమయపల్లి, సంగినోనిపల్లితో పాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కుంభం శివకుమార్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ శివకుమార్ రెడ్డి పార్టీ కండువాలు వేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పెద్దఎత్తున స్వాగతం లభిస్తున్నదని కుంభం పేర్కొన్నారు. ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో స్పందన పెరిగిందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను తరిమి కొట్టేవరకు కాంగ్రెస్ సైన్యం తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.