విధాత,పెద్దపల్లి: రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆరెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆపార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఇక్కడ పర్యటించి వెళ్లారు. ఆ వెంటనే పార్టీకి చెందిన ప్రముఖ నేత కందుల సంధ్యారాణి నిర్ణయం తెరపైకి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో కొంతమంది బీఆరెస్ నాయకులు తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సంధ్యారాణి విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు అనేవి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.
రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్ సీఎల్, మెడికల్ కళాశాలలో ఉద్యోగ దందా జోరుగా నడుస్తున్నదని ఆరోపించారు. ఇక్కడ గెలిచిన కొంతమంది నాయకులు దోపిడీయే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా తనను అణగదొక్కడానికి కౌశిక్ హరి, మక్కాన్ సింగ్, కోరుకంటి చందర్ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కోరుకంటి చందర్ తమ కాళ్లు పట్టుకొని బతిమిలాడితే చందాలు వేసుకుని గెలిపించామని తెలిపారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ గెలుపులో కూడా తన కృషి ఎంతో ఉందని అన్నారు. శాసనసభ్యునికి వ్యతిరేకం అన్న కారణంగా తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. రాజకీయ అవకాశాలపై ప్రకటనలకు పరిమితం కాకుండా, మహిళలకు అవకాశం కల్పించడం అన్నదానిని ఆచరణలోకి తీసుకురావాలన్నారు.
కాగా.. తనతోపాటు తన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. రాజీనామా సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. ఈసారి ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.