ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికొక పార్టీ చొప్పున ఐదుగురు ప్రధానులు పనిచేస్తారని ఇండియా కూటమి వింత ఫార్మూలా తెస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హేళన చేశారు
ఇండియా కూటమిపై ఆగ్రహం
అబద్దాలలో కాంగ్రెస్ కు అగ్రస్థానం
మాట తప్పిన బీఆరెస్ నాయకులు
విజయపథంలో బీజేపీ అభ్యర్ధులు
చర్మం రంగుపై మాట్లాడిన మోదీ
వరంగల్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికొక పార్టీ చొప్పున ఐదుగురు ప్రధానులు పనిచేస్తారని ఇండియా కూటమి వింత ఫార్మూలా తెస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హేళన చేశారు. ఇండి కూటమికి విజయం చేకూరిస్తే దేశ పరిస్థితి ఏమవుతుందోనంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా కొత్త ప్రధాని వస్తే దేశానికి ఏం ప్రయోజనముంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోదీ రైతుల కథ కూడా చెప్పారు. పది మంది రైతులు జమగూడి జల నిపుణుని వద్దకు వెళ్ళి బోర్ వేయాలని అడుగుతే వందడుగుల లోతులో నీళ్ళుపడుతాయని ఆ నిపుణుడు చెబుతారు. రైతులు స్పందించి ఒక్కొక్కరి పొలంలో పదడుగులు బోర్ వేయమని కోరారట దీని వల్ల రైతులకు నీళ్ళొస్తాయా? ఇండియా కూటమి ఐదుగురు ప్రధానుల ఫార్ములా అలాగే ఉందనే ఎద్దేవా చేశారు.
బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధుల ప్రచారంలో భాగంగా వరంగల్లో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ మాట్లాడుతూ అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి అగ్రస్థానం దక్కుతోందని రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలోపు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆగస్టు 15కు వాయిదా వేశారని విమర్శించారు. పైగా సనాతన ధర్మాన్ని తిట్టిపోసే కాంగ్రెస్ వేములవాడ రాజన్న పై ఒట్టేస్తున్నారని, ఎన్నికల తర్వాత మొండి చేయి చూపెడుతారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ వసతి, మహిళలకు రూ.2500 ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగాయని, కాంగ్రెస్ నమ్మక ద్రోహి అంటూ మండిపడ్డారు.
ఆర్, ఆర్ టాక్సు పేరుతో లూటీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని మోదీ అన్నారు. ఖజానా ఖాళీ అవుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఆర్ ఆర్ టాక్సు పేరుతో లూటీ చేస్తున్నారని, ఇందులో ఒక భాగం ఇక్కడి ఆర్ కు, మరో భాగం ఢిల్లీ ఆర్ కు పంపిస్తున్నారని విమర్శించారు. బీఆరెస్ కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్మును లూటీ చేస్తే కాంగ్రెస్ వారిని రక్షిస్తోందని ఆరోపించారు. పర్యావసానాన్ని మాత్రం తెలంగాణ రైతులు అనుభవిస్తున్నారని అన్నారు. బీజేపీ రైతులకు ప్రాధాన్యతినిస్తోందనీ అందుకే పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ధాన్యం, పత్తి కొనుగోళ్ళు చేపట్టామన్నారు.
40లక్షల మందికి కిసాన్ సమ్మాన్ నిధులు అందిస్తున్నామని, రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించామన్నారు. వరంగల్లో టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ఆర్ టాక్సు వేస్తోందన్నారు. తెలంగాణకు నష్టం చేసే వారికి సమాధానం చెప్పాలని, వికసిత భారత్ కోసం మోదీ గ్యారంటీ ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఆ పార్టీలు ఎటిఎంగా మార్చేశాయని విమర్శించారు. ఝార్కండ్ లో నోట్ల కట్టలు బయటపడ్డాయని, గతంలో రూ.300 కోట్లు కాంగ్రెస్ నాయకుని వద్ద దొరికాయని, వీటిని వెలికితీస్తే మోదీని తిడుతున్నారని అన్నారు.
రిజర్వేషన్లు తగ్గిస్తున్న కాంగ్రెస్
రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ కు విలువ లేదని మోదీ విమర్శించారు. అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వ్యతిరేకించారని కానీ, కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లీంలకు రిజర్వేషన్లు కల్పించారని మండిపడ్డారు. హైకోర్టు అడ్డుపడినా ప్రత్యేక చట్టం చేసి అమలు చేస్తామంటూ భరోసా ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లీంలకు ఇవ్వాలని చూస్తున్నారని, ఈ అన్యాయాన్ని సహిస్తారా? అంటూ ప్రశ్నించారు. మాదిగ సమాజానికి తాను ఇచ్చిన హామీని అమలు చేస్తామని, తమ్ముడు కృష్ణ మాదిగ మా వెంట ఉన్నారని చెప్పారు. ట్రైబల్ యూనివర్సీటి ఏర్పాటు చేసి ఎస్టీలను విద్యావంతులను చేయాలని చూస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. ఎస్సీ,ఎస్టీలు కుర్చీలో కూర్చుంటే సహించలేరని విమర్శించారు. బీఆరెస్ కూడా గతంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని అమలు చేయలేదని మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని ముస్లీంలను బుజ్జగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు.
చర్మం రంగు రాజకీయం
చర్మం రంగు మనిషి యోగ్యతను నిర్ధేశిస్తుందా? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. మేము దళితుడు రామనాథ్ కోవింద్ ను, గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి చేశామని చెప్పారు. కాంగ్రెస్ దీన్ని అడ్డుకుందన్నారు. దీనికి కారణం చర్మం రంగేనని ఈ మధ్య తెలిసిందని మోదీ తీవ్రమైన విమర్శ చేశారు. చర్మం నల్లగా ఉన్న వారు ఆఫ్రికాకు చెందిన వారని అమెరికా, లండన్ కు చెందిన వారి ఫిలాసఫీ అంటూ వివరించారు. వీరు రాజకుమారుడి ఫిలాసఫర్లని అందుకే నల్లరంగుతో ఉన్న ముర్ముకు మద్ధతు తెలియజేయలేదంటూ రాహూల్ గాంధీపై తీవ్ర ఆరోపణ చేశారు. చర్మం రంగేదైనా వీరంతా నల్లగా ఉండే కృష్ణుని భక్తులంటూ వివరించారు. అందుకే తాను తీవ్రమైన కోపంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. చర్మం పై ఆధారపడి యోగ్యత నిర్ణయిస్తారా? దేశ ప్రజలను అవమానిస్తారా? రాజ్యాంగాన్ని నెత్తినపెట్టుకుని విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించమంటూ హెచ్చరించారు.
మూడవ దశలోనే ఎన్డీయే విజయం
పార్లమెంటు ఎన్నికల్లో మూడవ దశలోనే ఎన్డీయే కూటమి విజయపథంలో పయనిస్తోందని, నాల్గవ దశలో కాంగ్రెస్ తమ గెలుపు స్థానాలను భూతద్దంతో కాకుండా మైక్రోస్కోప్ తో చూడాల్సి వస్తోందని, తెలంగాణలో కూడా ఆ ఉత్సాహం కన్పిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో రెండు ఎంపీ స్థానాలు బీజేపీ గెలిస్తే అందులో వరంగల్ స్థానం ఒక్కటని గుర్తుచేశారు. బీజేపీ ఎప్పుడు కష్టంలో ఉంటే అప్పుడు వెన్నంటి నిలిచారని అన్నారు.
బీజేపీ విజయం అత్యవసరం
వికసిత భారత్, పిల్లల భవిష్యత్తు కోరుకుంటున్నారా? అయితే మూడవసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ప్రపంచం అస్థిరతను, అశాంతిని, సమస్యలను, భయానక వాతావరణంలో ఉన్న ఈ తరుణంలో ఆప్ కీ బార్ మోదీ సర్కార్ అవసరం ఉందన్నారు. పదేళ్ళక్రితం కాంగ్రెస్ చేసిన పాపాలు, కుంభకోణాలు, బాంబు పేలుళ్ళు ఎవరూ మరిచిపోలేదన్నారు. ఎక్కడ కాంగ్రెస్ వచ్చిందో అక్కడ సమస్యలు వస్తాయని మండిపడ్డారు. ఈ సభలో వరంగల్ ఎంపీ అభ్యర్ధి అరూరి రమేష్ మాట్లాడుతూ అనేక సమస్యలను ప్రస్తావించారు. మానుకోట ఎంపీ అభ్యర్ధి సీతారాం నాయక్, బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించారు.
!!!!