చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని, చేనేత కళను వారసత్వంగా మరొకరికి అందించడం అభినందనీయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని, చేనేత కళను వారసత్వంగా మరొకరికి అందించడం అభినందనీయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిదిలో భాగంగా బుధవారం భూదాన్ పోచంపల్లి సందర్శనకు వచ్చిన రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన షా, రాష్ట్ర చేనేత శాఖ కార్యదర్శి అలుగు వర్షిణ, జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే ఘన స్వాగతం పలికారు.
తొలుత రాష్ట్రపతి పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్స్ సందర్శించి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్ సందర్శించి, నూలు నుండి వస్త్ర ఉత్పత్తి పరిణామక్రమాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆచార్య వినోబా భావే చిత్రపటానికి రాష్ట్రపతి పూలమాల వేసి, వినోబా భావే ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. చేనేత రంగంలో కృషి చేస్తున్న అవార్డు గ్రహీతలు భోగ సరస్వతి, లోక శ్యామ్ కుమార్, కూరపాటి వెంకటేశం చేనేత రంగంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము ప్రసంగిస్తూ చేనేత రంగం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉందని, 35 లక్షల మంది ప్రతిరోజూ తమ జీవనోపాధిని పొందుతున్నారని అన్నారు.
తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి
తెలంగాణలో నేసిన వస్త్రాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచాయని, పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జీఐ టాగ్ రావడం జరిగిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. చేనేత రంగాన్ని భవిష్యత్ తరాలకు తీసుకు వెళుతున్న మీరు నేసే చీరలను చూసి ఆనందం కలిగిందని అన్నారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు. యూఎన్ డబ్ల్యుటీఓ ప్రపంచ పర్యాటక రంగంలో 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని పర్యాటక గ్రామంగా ప్రకటించడం పట్ల మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
సంస్కృతి పరంపర పరిరక్షణను, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళుతున్నారని, శాస్త్ర సాంకేతిక రంగంలో మీకృషి ప్రశంసనీయమని అన్నారు. గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ, చేనేత రంగంలో కొత్త ఒరవడికి కృషి చేస్తున్న మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. చేనేత రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా ఉండాలని అన్నారు. చేనేత రంగంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నాప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకువచ్చి చేనేత రంగం పనితీరును పరిశీలించడం జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ‘ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీం. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం హర్షణీం.. పోచంపల్లి చేనేత కార్మికులు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
రాష్ట్రపతి పర్యటనలో అపశ్రుతి
పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రత్యేక హెలికాప్టర్ లో పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతి కోసం భద్రతా బలగాలు హెలిపాడ్ వద్ద బందోబస్తు కోసం ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఫ్యాన్ గాలి తీవ్రతకు అక్కడ ఉన్న కార్పెట్స్ గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో బందోబస్తులో ఉన్న ఇద్దరు పోలీసులతోపాటు ట్రాఫిక్ ఏసీపీకి గాయాలయ్యాయి. గాల్లోకి ఎగిరిన కార్పెట్ కు చేతులు అడ్డుపెట్టడంతో ఏసీపీ చెయ్యి ఫ్రాక్చర్ కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు