కులగణనతో రాజకీయ చైతన్యం, చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ శ్రీకారం, వెనుకబడినవర్గాల శక్తి తెలియజేయడానికే కులగణన దేశంలోని నిరుపేదల జాబితాను సిద్ధం చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు కావాల్సింది నేను ఢిల్లీలో చేసి పెడతా రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం ఈ ఎన్నికలు నర్సాపూర్, ఎల్బీ నగర్ జనజాతర సభలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి : కుల గణనతో రాజకీయ చైతన్యం వస్తందని, ఆ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ స్వీకారం చుట్టబోతున్నదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పేదల స్వప్నాన్ని సాకారం చేసి చూపెట్టబోతున్నామన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదని తెలిపారు. దేశంలోని నిరుపేదల జాబితాను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని పేదల జాబితా కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. కోట్లమందిని ధనికులుగా మార్చే సమయం ఇప్పుడు ఆసన్నం అయిందన్నారు. జూన్ 4న దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని రాహుల్ చెప్పారు.
25 మంది పెట్టుబడిదారుల కోసమే మోదీ
దేశంలోని 25 మంది పెట్టబడిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందాలని మోదీ అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసమే ప్రైవేటీకరణ అని స్పష్టంచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచడం వెనుక రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర దాగి ఉందని తెలిపారు. తాము మాత్రం కోట్ల మంది పేద ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు.
కులగణ చేస్తే నిజాలన్నీ బయటకు
ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల జనాభాను ప్రత్యేకంగా లెక్కిస్తే నిజాలు బయటకు వస్తాయని రాహుల్ అన్నారు. దేశంలో తొంభై శాతం ఉన్న ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు జనాభా మేరకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కులగణన చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. దేశంలో వెనుకబడినవర్గాల వారి శక్తి ఎంతో తేలాల్సి ఉందన్నారు. కులగణన తర్వాత దేశంలో రాజకీయ చైతన్యం వస్తుందన్నారు.
పేదలకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగం
పేదలు, రైతులు, ఆదివాసీలు, గిరిజనులకు భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తున్నదని రాహుల్గాంధీ అన్నారు. రాజ్యాంగం ఆమోదించుకోవడానికి ముందు వెనుకబడిన వర్గాలకు ఎలాంటి హక్కులు లేవని గుర్తు చేశారు. పేదలకు శక్తి దొరికింది రాజ్యాంగం వల్లనే అన్నారు. రాజ్యాంగం సామాన్యుల గొంతుక అని చెప్పారు. వేలమంది త్యాగఫలమే రాజ్యాంగమన్న రాహుల్ గాంధీ.. నెహ్రూ, అంబేద్కర్ కలిసి ఏళ్లపాటు చమట్చోడి రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు.
సిద్ధాంతాల మధ్య పోరాటే ఈ ఎన్నికలు
ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని రాహుల్గాంధీ చెప్పారు. ఒకవైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డి ఉండి.. రాజ్యాంగాన్ని మార్చవద్దని అంటున్నారన్నారు. మోదీ, ఆర్ఎస్ఎస్ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారన్నారు. తాము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని రాహుల్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలకు ఉందన్నారు.
పదేళ్లుగా అదానీ కోసం పని చేసిన మోదీ
పదేళ్లపాటు అదానీ కోసం ప్రధాని మోదీ పనిచేశారని రాహుల్ ఆరోపించారు. దేశంలో విమానాశ్రయాలు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో తొంభై శాతం సంపద రెండు శాతం మంది దగ్గర ఉందని, దేశాన్ని వారే శాసిస్తున్నారని చెప్పారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష
ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి వారి అకౌంట్లో ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కోట్లాది మహిళల అకౌంట్లలో ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నామని ప్రకటించారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని నిర్మూలించబోతున్నామని వెల్లడించారు. మోదీ ఎంత సొమ్ము పెద్దలకు ఇచ్చాడో అంత సొమ్మును తాము పేదలకు పంచుతామని తెలిపారు.