రేప‌టి నుంచి నామినేషన్ల స్వీకరణ: ఆర్డీఓ చెన్నయ్య

రేప‌టి నుంచి నామినేషన్ల స్వీకరణ: ఆర్డీఓ చెన్నయ్య
  • 10వ తేదీ వరకు గడువు
  • ఆర్డీఓ, ఆర్ఓ చెన్నయ్య


విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నవంబర్ 30న జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఈనెల 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డిఓ బి.చెన్నయ్య తెలిపారు. గురువారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3 ఉదయం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించబడుతాయన్నారు. ఈనెల 5 ఆదివారం సెలవు రోజున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు.


నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉచితంగా అందజేస్తామన్నారు. నామినేషన్లను వేయు అభ్యర్థులు రూ 10వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు రూ 5000 సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రంతో పాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణల పత్రం జతపరచవలసి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లకు 48 గంటల ముందు బ్యాంకు ఖాతా తెరవవలసి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఏ, ఫారం-బీలను, ఒరిజినల్ పత్రాలను ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు.


నామినేషన్ వేసే అభ్యర్థి తన పత్రంలోని ప్రతి కాలమ్ తప్పనిసరిగా నింపాలన్నారు. నామినేషన్ పత్రంలో ఏ కాలమ్‌ కూడా ఖాళీగా వదిలేయొద్దని, ఆ కాలంలో నింపాల్సింది లేకపోతే లేదని వర్తించదని రాయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం- 26, నోటరైజ్డ్ ఆఫీడవిట్ లో అన్ని కాలామ్‌లను నింపాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో గుర్తింపు పొందిన పార్టీ వారు అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుందని, గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే పది మంది ప్రతిపాదించవలసి ఉంటుందని తెలిపారు.


పోటీ చేసే అభ్యర్థులు ఆఫీడవిట్ సమర్పించాలని, అభ్యర్థి రెండు స్టాంప్ సైజ్ ఫోటోలును ఒకటి నామినేషన్ ఫారం పైన, రెండోది ఆఫీడవిట్ పైన అంటించాలన్నారు. అదనముగా నాలుగు లేటెస్ట్ సైజ్ ఫోటోలు10 అందజేయాలన్నా రు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అవుతుందన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వివిటి టీం, అకౌంటింగ్ టీం, సి- విజల్, హెల్ప్ డేస్కులను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల వివరాలను వెంటవెంటనే ఎన్ కోర్ అనే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను పాటించి నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు.


నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: డీఎస్పీ వెంకటగిర


మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరించే కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ డిఎస్పి పి.వెంకటగిరి తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు ఇరువైపులా 100 మీటర్ల దూరంలో భారీ కేడ్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించే సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఖమ్మం కోదాడ నుంచే వచ్చే వాహనాలను ఈదులగూడ బైపాస్ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాజీవ్ చౌక్ నుంచి వాహనాలకు హనుమాన్ పేట నుంచి దారి మళ్లించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నియమ, నిబంధనలను పాటించి సహకరించాలని డిఎస్పి వెంకటగిరి కోరారు.