తెలంగాణ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని మాణిక్ రావు థాక్రేతో కలిసి బుధవారం సాయంత్రం హైద్రాబాద్కు బయలుదేరారు.
విధాత: పీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రేతో కలిసి బుధవారం సాయంత్రం హైద్రాబాద్కు బయలుదేరారు. అంతకుముందే హైద్రాబాద్కు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన రేవంత్రెడ్డిని హైకమాండ్ పెద్దలు అత్యవసరంగా వెనక్కి పిలిచారు. దీంతో రేవంత్రెడ్డి మహారాష్ట్ర సదన్కు వెళ్లి మాణిక్ రావుతో భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం ఇద్దరు హైద్రాబాద్ బయలుదేరారు. రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. సీఎంగా తన పదవీ ప్రమాణా స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్లను రేవంత్ కలిశారు.
అనంతరం పలువురు ఏఐసీసీ నేతలను రేవంత్ కలిసి వారందరిని ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పెద్దలతో తన మంత్రివర్గం కూర్పులో అనుసరించాల్సిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు కనీసం తొమ్మిది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయవచ్చని భావిస్తున్నారు.
ఇటు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ను సీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాక ఆయన హైద్రాబాద్కు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఎల్బీస్టేడియంలో రేపు సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణాస్వీకారోత్సవానికి కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.