బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్కు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులు మద్దతు ప్రకటించారు
మున్నూరు కాపులదీ అదే బాట
విధాత బ్యూరో, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్కు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులు మద్దతు ప్రకటించారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో ఆదివారం జరిగిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రజల పక్షాన పనిచేస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మరోవైపు మున్నూరు కాపు సంఘం నాయకులు సైతం తమ మద్దతు సంజయ్కేనని తెలిపారు.
కాపువాడలో నిర్వహించిన మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమావేశంలో వారీమేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన మున్నూరు కాపులంతా బండి సంజయ్ కే ఓటేయాలని కోరారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య, తిరుమణి రాజేశం, కళ్యాణపు ఆగయ్య, గుగ్గిళ్లపు రమేశ్, దుగ్గు మహేందర్ రాకేశ్ తదితరులు అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. బొమ్మరాతి రామచంద్రం, ఆగయ్య, యాదయ్య మాట్లాడుతూ కాపువాడలో పుట్టి పెరిగిన తమ బిడ్డ బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించుకునేలా ఇంటింటికీ ప్రచారం చేస్తామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వలస వాదులని, వారికి ఓట్లేయడంవల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ గురించి పట్టించుకోని వలసవాద అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. తొలుత బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగిన మీ బిడ్డను. మీరే నా ధైర్యం. మీ అండతోనే కేసీఆర్ పై పోరాడి ఆయనను గద్దె దించడంలో ప్రముఖ పాత్ర పోషించా.. మీ ప్రోత్సహంతోనే కాంగ్రెస్ మోసాలను ఎండగడుతున్నా. మీరు వేసిన ఓటుతోనే కరీంనగర్ విలువ పెంచిన.’’అని పేర్కొన్నారు. కరీంనగర్ లో తనను నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్కక్కై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఇతర పార్టీల కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతోనే వందల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసేందుకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన గ్రామీణ వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కోవిడ్ టైంలో గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్లు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులే. పేదలకు భరించగలిగే డబ్బుతోనే చికిత్స చేయగలిగే డాక్టర్లు మీరే. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటే ఆర్ఎంపీ, పీఎంపీలే కారణం. గ్రామాల్లో ఆర్ఎంపీలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేం.’’అని కొనియాడారు.
‘‘ప్రజల కోసం పనిచేసే నాయకుడి పక్షాన ప్రచారం చేయాలని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ అభివృద్ధి కోసం పాటుపడే అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. కరీంనగర్ నుండి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల గుణగణాలను బేరీజు వేసి మెరుగైన సమాజం కోసం పాటుపడే నాయకుడిని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్ఎంపీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ‘‘ఐదేళ్లలో కరీంనగర్ లోకసభ అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు తేగలిగా.. వాటిని లెక్కలతో సహా, చూపించా, అయినప్పటికీ నియోజకవర్గానికి ఏం చేశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
‘‘ఇక్కడి ప్రజలు ఎంపీగా తనను గెలిపిస్తే, రాష్ట్రమంతా తిరిగి ప్రజా సమస్యలపై కొట్లాడి.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 1600 కి.మీలు పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతుల పక్షాన ఉద్యమాలు చేసిన చరిత్ర తనదన్నారు. తనపై రాళ్ల దాడి చేసినా, కార్యకర్తల తలలు పగలకొట్టినా, 109 కేసులు నమోదు చేసినా, 2 సార్లు జైలుకు పంపినా భయపడకుండా ప్రజల కోసం నిలబడి, కలబడిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? ఎన్నడైనా ఉద్యమాలు చేశారా?’’అని ప్రశ్నించారు.