ఎన్నికల తర్వాతా పంట నష్టపరిహారం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు నిరాశ నిస్పృహాలకు లోను కావద్దని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల తర్వాతా వారికి పంట నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తాం
పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ అబద్ధాలు
విధాత, హైదరాబాద్ : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు నిరాశ నిస్పృహాలకు లోను కావద్దని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల తర్వాతా వారికి పంట నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు, కౌలు రైతుల అధైర్యపడవద్దని భరోసా నిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించారన్నారు. ఎన్నికల తర్వాత బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులకు ఆదేశించామని వెల్లడించారు. వర్షానికి కొట్టుకపోయిన ధాన్యాన్ని కూడా అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామన్నారు. బీఆరెస్ హయాంలో రైతులకు ఎలాంటి పరిహారం అందలేదని, ఇప్పుడు రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు పెడుతున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వారా బీఆరెస్ ఖాళీ కాబోతుందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆరెస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేశారు. ముగ్గురు బీఆరెస్ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల మధ్యలో డ్రాప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని..పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ భయపడి ఇలాంటి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని షబ్బీర్ అలీ అన్నారు. రేవంత్ రెడ్డితో 10 మంది బీరెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తెలిపారు. జైలులో కేసీఆర్ కు డబుల్ రూమ్ కట్టించారని.. కుటుంబ సభ్యులందరినీ అదే జైలులో ఉంచుతామని హెచ్చరించారు.