తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆన్లైన్ విద్యాబోధనలో కీలకంగా మారిన టి-శాట్ నెట్వర్క్ సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ టీ-శాట్ చానెళ్లకు సిగ్నల్ నిలిపేసింది.
పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆన్లైన్ విద్యాబోధనలో కీలకంగా మారిన టి-శాట్ నెట్వర్క్ సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ టీ-శాట్ చానెళ్లకు సిగ్నల్ నిలిపేసింది. కేయు బ్యాండ్ జి-శాట్ 16 శాటిలైట్ సేవల కోసం ఎంఓయు పునరుద్ధరణ చేయనందుకు సిగ్నల్ ఆపేస్తామని జులై 5వ తేదీన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నోటీస్ పంపించింది.
పది రోజులు గడిచినా రాష్ట్ర ఐటీ శాఖ నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం నుంచి పూర్తిగా సిగ్నల్ నిలిపేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, వైఎస్సార్ ప్రభుత్వాల హయాంలో ఏర్పాటైన సాప్ నెట్ అనే సంస్థను తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం హయాంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీ.శాట్ పేరుతో పునరుద్ధరణ చేశారు. సంస్థకు సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డిని నియమించి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం “నిపుణ”, “విద్య” అని రెండు చానెళ్లు ప్రారంభించారు.
ఇవి రెండు అటు విద్యార్థుల్లో, ఇటు నిరుద్యోగుల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా శైలేష్ రెడ్డి స్థానంలో బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అనే జర్నలిస్టుకు సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. తనకు తెలియకుండానే తన శాఖలో ఒక సంస్థకు సీఈవో నియమించడంపై అప్పట్లో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొంత కినుక వహించారు. టి.శాట్ పై ప్రభుత్వ ఉదాసీన వైఖరితో క్రమంగా సంస్థ కార్యకలాపాలు తగ్గిపోతూ ఇప్పుడు ఏకంగా రెండు చానెళ్లు మూతపడే పరిస్థితికి చేరింది.
టీ-శాట్ సేవలు పునరుద్ధరించాలి
టీ-శాట్ నెట్ వర్క్ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని ట్వీటర్ ఎక్స్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాల్సిన టీ-శాట్ ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగపోయాయని, దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.