జర్నలిజంలో కలుపు మొక్కలను ఏరివేస్తాం: టీయూడబ్ల్యూజే

- వృత్తిని అపవిత్రతకు గురిచేస్తే సహించేది లేదు
విధాత, హైదరాబాద్: జర్నలిజం వృత్తిలో మొలుస్తున్న కలుపు మొక్కల ఏరివేసే చర్యలకు టీయూడబ్ల్యూజే పూనుకోబోతున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ హెచ్చరించారు. మీడియా పేరుతో ఎలాంటి గుర్తింపులేని పత్రికలు, యూట్యూబ్ చానెల్స్ ఐడీ కార్డులు సృష్టించి, పవిత్రమైన జర్నలిజాన్ని అపవిత్రత పాలు చేస్తున్న అసాంఘిక శక్తులకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
జర్నలిజం పట్ల ఎలాంటి అవగాహన లేని అసాంఘిక శక్తులు, జల్సాలకు అలవాటుపడి, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి జర్నలిస్టులుగా చెలామణి అవుతూ సమాజంలో సృష్టిస్తున్న అలజడి సహించరానిదన్నారు. ఇటీవల మెదక్ జిల్లా నార్సింగ్ లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నకిలీ విలేకరుల ముఠాను పట్టుకొని వారికి తమ సంఘం సరైన గుణపాఠం చెప్పినట్లు గుర్తుచేశారు. అక్షరం ముక్క కూడా రాయలేని ఈ అసాంఘిక శక్తులు, జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడుతూ పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని అన్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ, మిడిదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి యువకుడు రాజు జేబులో ఏకంగా 5 మీడియా ఐడీ కార్డులు దొరకడం విస్మయం కలిగిస్తున్నదన్నారు. అవన్నీ నకిలీ మీడియా సంస్థలు సృష్టించిన ఐడీ కార్డులేనని తెలిపారు. జర్నలిస్టుల ముసుగులో ప్రతి గ్రామంలో ఇలాంటి అసాంఘిక శక్తులు పుట్టుకురావడం సమాజానికి పెనుప్రమాదంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే, జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవం, విలువలు మంట కలిసి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ సంఘం తగు కార్యాచరణ రూపొందించి, జర్నలిజం వృత్తిలో మొలుస్తున్న ఇలాంటి కలుపు మొక్కలను ఏరివేసే చర్యలకు పూనుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.