అవకాశాల కోసం నేను వెళ్ళలేదు....అవకాశాలే నన్ను వెదుక్కుంటూ వచ్చాయి....వాటిని నేను సద్వినియోగం చేసుకున్నానని ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న మాటలు
– జోడు ఎమ్మెల్యే, ఎంపీ
౼ కలిసొస్తే మూడూ
– ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ
– కొందరికి మంత్రి పదవి
విధాత ప్రత్యేక ప్రతినిధి: అవకాశాల కోసం నేను వెళ్ళలేదు….అవకాశాలే నన్ను వెదుక్కుంటూ వచ్చాయి….వాటిని నేను సద్వినియోగం చేసుకున్నానని ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న మాటలు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూపంలో ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు. రాజకీయాల్లో కలిసిరావాలే… అప్పుడే పదవులు వరిస్తాయి…మంత్రి పదవి కోసం మూడు దశాబ్దాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. కేసీఆర్ తనకు ఆ అవకాశం కల్పించారని అన్నారు.
కొందరి నేతల జీవితాలను పరిశీలిస్తే అర్ధమయ్యే నిష్టూర సత్యం. ఎన్నికల్లో మహామహులైన నేతలు మట్టికరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, కొందరికి కాలం కలిసొచ్చి తమ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. మరి కొందరిని ఎమ్మెల్సీ పదవి సైతం వరించింది. ఇందులో కొందరు మంత్రి పదవులు సైతం నిర్వహించడం విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిశీలిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచి, గెలిచిన నాయకులు చాలా మందే ఉన్నారు. ఈ నేతలెవరో తెలుసుకుందామా!
– ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి
– పెండ్యాల రాఘవరావు 1952లో (పీడిఎఫ్) నుంచి వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనే హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు స్థానాల్లో పోటీచేసి మూడింట గెలిచిన అరుదైన చరిత్ర పెండ్యాలకు దక్కుతోంది. తర్వాత రెండు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి ఎంపీగా మాత్రమే కొనసాగారు.
– రామసహాయం సురేందర్రెడ్డి 1965 (కాంగ్రెస్) ఉప ఎన్నికల్లో అప్పటి మహబూబాద్ నుంచి , 1967, 89, 91 వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. నూకల రాంచంద్రారెడ్డి మరణంతో 1974 లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి డోర్నకల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత మూడు పర్యయాలు 1978. 83, 85 ఎన్నికల్లో కూడా డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
– పీవి నర్సింహారావు 1977, 80లో (కాంగ్రెస్) హన్మకొండ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1957, 1962, 1967, 1972 వరుగా కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ర్టమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా తదుపరి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి, పదవులకు వన్నె తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు.
– చందుపట్ల జంగారెడ్డి 1984లో (బీజేపీ) హన్మకొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. పీవి నర్సింహారావును ఓడించిన చరిత్ర ఈయనకుంది. 1967లో పరకాల నుంచి బెజెఎస్ నుంచి, శాయంపేట నుంచి 1978, 1983లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
– కమాలొద్దీన్ అహ్మద్ 1980లో (కాంగ్రెస్) వరంగల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 1989, 91,96లో హన్మకొండ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1962లో చేర్యాల నుంచి 1967లో జనగామ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు.
– అజ్మీరా చందూలాల్1996, 98లలో రెండు పర్యాయాలు (టీడీపీ) వరంగల్ ఎంపీగా గెలుపొందారు. 1985, 1994 లో టీడీపీ పక్షాన, 2014లో టీఆర్ఎస్ తరుపున ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
– బోడకుంటి వెంకటేశ్వర్లు 1999లో (టీడీపీ) నుంచి వరంగల్ ఎంపీగా గెలుపొందారు. అనంతరం టీడీపీ నుంచి, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు.
– ధరావత్ రవీంద్రనాయక్2004లో (టీఆర్ఎస్) వరంగల్ ఎంపీగా విజయం సాధించారు. దీని కంటే ముందు దేవరకొండ నుంచి కాంగ్రెస్ పక్షాన 1978, 1983 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
– ఎర్రబెల్లి దయాకర్రావు 2008 ఉప ఎన్నికల్లో (టీడీపీ) వరంగల్ ఎంపీగా గెలుపొందారు. 1994, 99, 2004లో వర్ధన్నపేట నుంచి 2009, 2014లలో పాలకుర్తి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే పాలకుర్తిలో 2019 (టీఆర్ఎస్) నుంచి గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
– కడియం శ్రీహరి 2014లో (టీఆర్ఎస్) వరంగల్ ఎంపీగా గెలిచి ఏడాది లోపే రాజీనామా చేశారు. స్టేషన్ఘన్పూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 1994, 99, 2008 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కడియంను ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ఉప ముఖమంత్రి పదవులు వరించాయి. ఒక్క రాజ్యసభ మాత్రమే మిగిలింది. అరుదుగా కొందరికే ఈ అవకాశాలు లభిస్తాయి. అది వరంగల్ జిల్లాకు చెందిన కడియం కావడం విశేషం.
– డాక్టర్ గుండె విజయరామారావు రివర్స్, అంతా ఇక్కడ ఎంపీలుగా గెలిస్తే మనోడు అక్కడ ఎంపీగా… ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004(టీఆర్ఎస్) స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్షనేతగా, వైఎస్ కేబినేట్లో పౌరసరఫరా శాఖ రాష్ర్ట మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దీనికంటే ముందుగానే 1984లో (టీడీపీ) సిద్దిపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఎమ్మెల్యేగా… ఎమ్మెల్సీగా…మంత్రిగా
౼ బస్వరాజ్ సారయ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 1999, 2004, 2009లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
౼ గతంలో టీడీపీలో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యవతిరాథోడ్, తర్వాత ఎమ్మెల్సీగా ఎంపికై గత ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా బాధ్యత నిర్వహిచారు.
౼ డాక్టర్ బండా ప్రకాష్ తొలిసారి రాజ్యసభ ఎంపిగా గెలుపొందారు. రాజ్యసభ కాలపరిమితి ముగియకముందే దానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ శాసనమండలి వైఎస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. వీరికి తోడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి ఈ బాధ్యతలు నిర్వహించారు.