ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ను తిట్టమని అధికారం ఇవ్వలేదు కదా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో చాలా సంయమనంతో ముందుకు పోయాం
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ను తిట్టమని అధికారం ఇవ్వలేదు కదా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో చాలా సంయమనంతో ముందుకు పోయాం. ఒక చిన్న మతకల్లోలం లేకుండా అద్భుతమైన శాంతి భద్రతలో ప్రభుత్వాన్ని నడిపాం. అనుకోకుండా అధికారం వస్తుంది. దాన్ని ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవాలి. కేసీఆర్ను తిట్టమని అధికారం ఇవ్వలేదు కదా..? వన్ థర్డ్ సీట్లు గెలిచాం. కోటి పైచిలుకు ప్రజలు ఓట్లు వేశారు. మమ్మల్ని ప్రజలు తిరస్కరించలేదు. అనుకోకుండా జరిగిన గ్యాప్లో మీకు అధికారం ఇచ్చారు. శ్వేతపత్రం నుంచి మొదలుకొని ఐదు నెలల పాటు సమయం వృథా చేశారు. ఇచ్చిన హామీలు చేయకపోవడంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు అని కేసీఆర్ తెలిపారు.
వీళ్లు మొట్టమొదట మా మీద చేసిన ప్రధాన ఆరోపణ అప్పులు. విషయం ఏందంటే.. తెలంగాణ ఉద్యమానికి పోయినప్పుడు భయంకరమైన పరిస్థితి. మంచినీళ్లు లేవు. కాలిపోయే మోటార్లు, వర్షాలు లేవు. పవర్ లేని పరిస్థితి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసే పరిస్థితి. మన భవిష్యత్ ఏంటని బాధలో ఉన్న సమయంలో ఉద్యమం ప్రారంభించాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి.. ధ్వంసమైన తెలంగాణ పునర్ నిర్మాణం ఎలా ప్రారంభించాలని ఆలోచించాం అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ విధ్వంసంలో నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ చెరువులు. అదే లైఫ్ లైన్ తెలంగాణకు. 75 వేల చెరువుల్లో పది ఇరవై వేల చెరువులు కబ్జా అయ్యాయి. ఘోర కరువు ఏర్పడి బోర్లు పడని పరిస్థితి. కాకతీయ రాజులు చెరువులు కట్టించారు. ధ్వంసమైన శిథిలమైన చెరువులను పునరుద్ధరించాలని మిషన్ కాకతీయ పేరు పెట్టాం. సీఎం అయిన తొలినాళ్లలో చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ అని కేసీఆర్ పేర్కొన్నారు.