ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమైపోతుందనే జర్మన్ నేత గోబెల్స్ సిద్ధాంతాన్ని పాటిస్తూ మోదీ ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.
మోదీ వారం రోజుల సభల్లో అన్నీ అసత్యాలే
వాస్తవాలకు మసిబూసి.. మారేడుకాయ చేసి..
రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలపై నెపాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్కు గండి కొడతారని
ఎన్నికల సభల్లో చెబుతున్న ప్రధాని మోదీ
కుల గణన, సామాజిక సర్వేపై భారీ వక్రీకరణ
ఆ పేరుతో హిందువులను రెచ్చగొట్టే కుట్ర
ఎన్నికల నియమావళి పట్టని నేతలు
మతాల మధ్య విద్వేషాలు రగిల్చే యత్నం
ఓటమిపై భయంతోనే మోదీ మాటలు
మండిపడుతున్న ప్రతిపక్ష నాయకులు
(విధాత ప్రత్యేకం)
నిజం నిద్రలేచే సరికి అబద్ధం ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుందని నానుడి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందని జర్మన్ నియంత హిట్లర్ మంత్రి గోబెల్స్ సిద్ధాంతం! నిజం నిద్రలేచేలోపు అబద్ధంతో ప్రపంచ యాత్ర చేయించాలి.. గోబెల్స్ మాటల ప్రకారం ఒకే అబద్ధాన్ని.. ఎందరు ఖండించిన, ఎంత మంది వివరణ ఇచ్చినా.. పట్టించుకోకుండా.. వందసార్లు చెప్పి నిజమని నమ్మింపజేయాలి! ఇప్పుడు ఎన్నికల సభల్లో ప్రత్యేకించి గత వారం రోజుల వ్యవధిలో మోదీ చెబుతున్న మాటలు ఇలానే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు ప్రపంచం ముందు ఉన్నా.. వాటికి మసిపూసి మారేడు కాయ చేయడమే లక్ష్యంగా సాగిపోతున్నారని అంటున్నారు. రెండు విడుతల ఎన్నికల్లో బీజేపీకి ఆశించినంత ప్రయోజనం దక్కడం లేదని తేలిన తర్వాత అసత్య ప్రచారాలు విశృంఖల స్థాయికి చేరిపోయాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ : వారం రోజులుగా ప్రధాని మాట తీరు మారిపోయింది. ఈ వారం రోజుల్లో అనేక అబద్ధాలు మోదీ నోటి నుంచి వెలువడ్డాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకే అంశంపై పదే పదే అవాస్తవాలు చెబుతున్నారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఒక అడుగు ముందుకు వేసి.. ప్రజలకు అబద్ధాలు చెప్పే మొదటి ప్రధానిని ఇప్పుడే చూస్తున్నానని వ్యాఖ్యానించారు. మోదీ అసత్యాల ప్రవాహం రాజస్థాన్లోని బన్వ్వారాలో ఏప్రిల్ 21 నుంచి మొదలైందని పరిశీలకులు అంటున్నారు. ఆనాటి సభలో ప్రజల సొత్తును కాంగ్రెస్ స్వాధీనం చేసుకుని చొరబాటుదారులకు, అధిక సంతానం కలిగినవారికి పంచేస్తారని ఆరోపణ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది ఒకటి ఉంటుంది. ఏ అభ్యర్థి లేదా పార్టీ భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య విభేదాలను రెచ్చగొట్టడం కానీ, పరస్పర విద్వేషాన్ని లేదా ఉద్రిక్తతను సృష్టించే వ్యాఖ్యలు చేయరాదని నియమావళి పేర్కొంటున్నది.
మోదీ రాజస్థాన్లో పై వ్యాఖ్యలు చేసిన అనంతరం మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదు అనంతరం మోదీ ముస్లింల ప్రస్తావన ఆపేశారు.. కానీ ఆ ఒక్కరోజుకు మాత్రమేనని పరిశీలకులు చెబుతున్నారు. మళ్లీ ఏప్రిల్ 23 నుంచి నిరాటంకంగా విద్వేషపూరిత ప్రసంగాలతో అవాస్తవాలను ప్రజల మెదళ్లలో చొప్పించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హిందూసమాజంలోని బలహీన వర్గాలను పణంగా పెట్టి.. ఆ సమాజం ప్రయోజనాలు పొందుతున్నదని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొత్తంగా గత వారం రోజుల ప్రధాని ప్రసంగాలను గమనిస్తే ప్రతి సందర్భంలో అసత్యాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు మోదీ ప్రయత్నించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
హిందూ వివాహిత మహిళల తాళిబొట్లు సహా ప్రయివేటు ఆస్తులను సర్వే చేస్తామని, స్వాధీనం చేసుకుని, పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని ఏప్రిల్ 21న బాన్స్వారాలో మోదీ చెప్పారు. ‘నా తల్లులు, చెల్లెళ్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కేవలం అలంకారం కోసం కాదు.. అవి వారి ఆత్మాభిమానం. వారి మంగళసూత్రాలు వారి జీవితాలతో ముడిపడి ఉన్నాయి. మీ (కాంగ్రెస్) మ్యానిఫెస్టోలో వాటిని గుంజుకుంటామని బెదిరిస్తున్నారు’ అని మోదీ అన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మహిళల మంగళసూత్రాల మాటే కాదు.. ప్రైవేటు ఆస్తుల స్వాధీనం అనే ప్రస్తావన కూడా లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వనరుల్లో మొదటి హక్కు ముస్లింలకే ఉన్నాయని చెప్పాయని మోదీ అన్నారు. నిజానికి ఇది కూడా అవాస్తవమే.
2009లో మన్మోహన్ ప్రధానిగా ఇచ్చిన ఉపన్యాసాన్ని మోదీ వక్రీకరించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మతపరమైన మైనార్టీలనే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల, చిన్నపిల్లలు.. ఇలా అణగారిన అన్ని వర్గాల సమున్నతికి కృషిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆనాడు మన్మోహన్సింగ్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇక మోదీ చెప్పిన మరో అంశం దేశ ప్రజల సంపదను స్వాధీనం చేసుకుని ‘చొరబాటుదారులు’, ‘అధిక సంతానం ఉన్నవారికి పంచుతారనేది. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసిన వ్యాఖ్య అనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి,స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని ఇక్కడ కూడా మోదీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని యువరాజు అని సంబోధిస్తూ.. ‘తాము అధికారంలోకి వస్తే మీకు ఎంత ఆదాయం ఉన్నది? మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అనేది కనుగుగనేందుకు సర్వే చేస్తామని, వాటిని స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నాడు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెప్పేది ఇదే’ అన్నారు. నిజానికి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో దీన్ని చెప్పలేదు. ఏప్రిల్ 6వ తేదీన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన రాహుల్గాంధీ.. ‘ఈ దేశాన్ని మేం ఎక్స్రే తీస్తాం. ఈ దేశ సంపదలో వారి భాగమెంతో వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, జనరల్ క్యాటగిరీలోని పేదలు, మైనార్టీలు తెలుసుకుంటాయి’ అని చెప్పారు. ప్రైవేటు ఆస్తులు స్వాధీనం చేసుకుంటామనిగానీ, వాటిని పునఃపంపిణీ చేస్తామని గానీ రాహుల్ చెప్పలేదు. ‘మీ ఊళ్లో మీకు పూర్వీకుల ఇల్లు ఉంటే.. మీరు ఏదన్నా నగరంలో మీ పిల్లల కోసం ఇంటిని కొనుగోలు చేసి ఉంటే వాటిని కూడా కాంగ్రెస్ లాగేసుకుంటుందని అని మోదీ ఆరోపించారు. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును, పేద మహిళల ఆస్తులను లూటీ చేయాలనుకుంటున్నదని చెప్పారు. పునఃపంపిణీకి సంబంధించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఒక విషయం చాలా స్పష్టంగా ఉన్నది. దేశంలో ప్రభుత్వ భూమి, భూపరిమితి చట్టం పరిధిలోని మిగులు భూములను పేదలకు పంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఒక అథార్టీని నెలకొల్పుతామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో తెలిపింది. నిజానికి భారతదేశంలోని 21 రాష్ట్రాల్లో ఇప్పటికే భూపరిమితి చట్టాలు ఉన్నాయి. దేశ ప్రజలకు భూమి హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో 1960వ దశకంలోనే ఈ చట్టాలు తీసుకువచ్చారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఎక్స్ రే అంశాన్ని ప్రస్తావించిన మోదీ.. ‘దానర్థం ఏమిటంటే.. మీరు మీ ఇంట్లో సజ్జలను ఒక డబ్బాలో పెట్టుకుంటే.. దాన్ని కూడా ఎక్స్రే తీస్తారు. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపద ఉన్నదని తేలితే దానిని స్వాధీనం చేసుకుని, పునఃపంపిణీ చేస్తారు. మీకు రెండు ఇళ్లు ఉంటే.. అది వారి ఎక్స్రేలో కనిపిస్తే ఒకటి ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఇది మీకు ఆమోద యోగ్యమేనా?’ అని ఏప్రిల్ 23న టాక్ సవాయి మాధోపూర్లో ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కానీ, లేదా ఆ పార్టీ నాయకుల ప్రసంగాల్లో కానీ ప్రజల ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పునఃపంపిణీ చేస్తుందని ఎక్కడా ప్రస్తావనలే లేవు. ఇదే ఉపన్యాసంలో మరో అసత్యాన్ని చెప్పిన మోదీ.. దేశ వనరులపై ముస్లింలకు తొలి హక్కు ఉన్నదని మన్మోహన్ చెప్పారని పేర్కొన్నారు. మోదీ చెబుతున్న ఉపన్యాసం వీడియో ప్రధాన మంత్రి కార్యాలయంలోని ఆర్కైవ్స్లో ఉంటుందని, దానిని పరిశీలించుకోవచ్చని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమైపోతుందనే జర్మన్ నేత గోబెల్స్ సిద్ధాంతాన్ని పాటిస్తూ మోదీ ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. కర్ణాటకలో సైతం మోదీ పలుకులు అసత్యాలేనని అర్థమవుతున్నది. ‘ఒకే ఒక్క నోటిఫికేషన్తో అన్ని ముస్లిం కమ్యూనిటీలను ఓబీసీ కోటాలో చేర్చారు. ఓబీసీ రిజర్వేషన్లలో ఒక పెద్ద భాగాన్ని తీసి, మతప్రాతిపదికన ఇచ్చేశారు’ అని చెప్పారు. వాస్తవానికి 1962లో కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం తెగల్లోని కొన్ని కులాలను ఓబీసీ క్యాటగిరీలో చేర్చింది. ఆర్ నాగనగౌడ కమిషన్ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకుంది కానీ.. మతప్రాతిపదికన కాదని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అన్ని వెనకబడిన కమ్యూనిటీల వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపు అంశానికి ప్రాతిపదికలను సూచించడానికి ఈ ప్యానెల్ను నియమించారు. దానికంటే ముందే 1921లో ముస్లిం రిజర్వేషన్లపై ఒక విధానాన్ని అప్పటి మైసూరు మహారాజా ప్రవేశపెట్టారు. 1994లో అప్పటి దేవగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్ని ముస్లిం తెగలను ఓబీసీ జాబితాలోకి తెచ్చింది. ఆ పని చేసిన జేడీఎస్.. ఇప్పుడు తన ఎన్డీయే కూటమిలోనే ఉన్న సంగతిని మోదీ మర్చిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముస్లింలను సామాజిక, ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన ఓబీసీ కోటాలో చేర్చిన 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కర్ణాటక ఒకటి. మరో విచిత్రం ఏమిటంటే.. మోదీ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ సైతం ముస్లింలను ఓబీసీ క్యాటగిరీలో చేర్చింది. రెండేళ్ల క్రితం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుజరాత్లో సుమారు 70 ముస్లిం కులాలు రిజర్వేషన్ ప్రతిఫలాలు పొందుతున్నారని కూడా చెప్పుకొన్నారు. అయితే.. కర్ణాటక రిజర్వేషన్లకు సంబంధించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యతిరేకమూ, అంబేద్కర్ ఆదర్శాలకు విరుద్ధమైన కాంగ్రెస్ నిర్ణయాన్ని రద్దు చేసి, దళితులు, ఆదివాసీలకు వారి హక్కలు తిరిగిఇచ్చామని చెప్పుకొన్నారు. నిజానికి 2023 మార్చిలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం సబ్కోటాను రద్దు చేసినప్పటికీ.. దళితులకు, ఆదివాసీలకు మాత్రం ఆ కోటాను మళ్లించలేదు. దానికి బదులు రాష్ట్రంలో రెండు ప్రధాన కమ్యూనిటీలైన లింగాయతులు, వక్కలిగలకు బదిలీ చేశారు. ఇది లోపభూయిష్టంగా ఉన్నదంటూ సుప్రీంకోర్టు వాటిపై స్టే ఇచ్చింది.
ఆ తర్వాత వారసత్వ ఆస్తి పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతున్నదంటూ మోదీ కొత్త పల్లవి అందుకున్నారు. మీరుతదనంతర మీ పిల్లలు మీ ఆస్తికి వారసులవుతారని, కానీ.. కాంగ్రెస్ దానిని కూడా గుంజుకుంటుందని ఆరోపించారు. ఒక దశలో ఇందిరాగాంధీ ఆస్తులపై వారసత్వ హక్కు పొందాలనే రాజీవ్గాంధీ అప్పటికి ఉన్న వారసత్వ ఆస్తి పన్ను రద్దు చేశారని చెప్పారు. నిజానికి ఇందిరాగాంధీ తాను జీవించి ఉన్న కాలంలోనే తన యావదాస్తిని నెహ్రూ మెమోరియల్ ఫండ్కు ఇచ్చేశారు. ఏప్రిల్ 25న మాట్లాడిన మోదీ.. కొత్త ఆరోపణ తెరపైకి తెచ్చారు. ఆర్థిక సర్వే మాత్రమే కాకుండా.. అన్ని సంస్థలను, అన్ని ఆఫీసులను కూడా కాంగ్రెస్ సర్వే చేస్తుందని, అందులో ఒకే బీసీ లేదా దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉంటే వారిలో ఒకరిని తొలగించి, ఆ స్థానంలో దేశ వనరులపై తొలి హక్కు ఉన్నదని చెబుతున్నవారికి ఇచ్చేస్తారని ఆరోపించారు. మొత్తంగా మోదీలో ఓటమి భయం బాగా కనిపిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే విద్వేషాలతోపాటు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని చెబుతున్నారు.