• Telugu News
  • /Vidhaatha special

Unpaid Bills | బకాయిలు చెల్లిస్తారా.. హైకోర్టు ముందు నిలబడతారా? ఆర్థిక శాఖపై న్యాయస్థానాలకు రిటైర్డ్‌ అధికారులు.. కాంట్రాక్టర్లు..

తెలంగాణలో పెండింగ్‌ బిల్లులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లింపుల కోసం హైకోర్టును ఆశ్రయించాల్సని దుస్థితి నెలకొన్నది.

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Apr 01, 2026, 7:39 pm IST
Read Time: 10 mins
Unpaid Bills | బకాయిలు చెల్లిస్తారా.. హైకోర్టు ముందు నిలబడతారా? ఆర్థిక శాఖపై న్యాయస్థానాలకు రిటైర్డ్‌ అధికారులు.. కాంట్రాక్టర్లు..

(తిప్పన కోటిరెడ్డి)

Unpaid Bills | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు తమ డబ్బుల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇంకా డబ్బుల చెల్లింపులో పారదర్శక విధానాన్ని ప్రభుత్వం అవలంబించడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. కమీషన్లు ఇచ్చిన వారికే నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలకు ముగింపు పలకడం లేదు. చేప పిల్లలను సరఫరా చేసిన ఏజెన్సీలకు డిసెంబర్ 5వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని లేదా 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను హైకోర్టు ఆదేశించింది.

చదివింది ఒకటి.. సర్టిఫికేట్లపై ఇంకోటి.. వెలుగులోకి ఫేక్ కాంట్రాక్టు ఉద్యోగుల భాగోతం

రాష్ట్రంలో చేప పిల్లల సరఫరాదారు అయిన ఆర్.కే ఫిషరీస్ ట్రేడర్స్ అండ్ సీడ్ సప్లయర్స్‌తోపాటు మరికొందరు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. తమకు తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని, అప్పులతో మరింత నష్టపోతున్నామని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ఆర్థిక శాఖను ఆదేశించింది. నెలలు గడిచినా ఉత్తర్వులు అమలు కాకపోవడంతో సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ కే శరత్ విచారించారు. తమ ఉత్తర్వులను డిసెంబర్ 5వ తేదీలోపు అమలు చేయాలని లేదా 5న హైకోర్టు మందు హాజరు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు తేల్చి చెప్పారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా, నాలుగు వారాల గడువు ఇస్తూ డిసెంబర్ 5కు కేసు వాయిదా వేశారు. ఇలా పలువురు తమ బకాయిల చెల్లింపు కోసం హైకోర్టులో కేసులు వేస్తునే ఉన్నా ప్రభుత్వంలో ఇసుమంత చలనం కూడా లేకపోవడం గమనార్హం. పదిహేను శాతం కమిషన్లు ఇస్తేనే బిల్లులకు మోక్షం లభిస్తుందనేది జగమెరిగిన సత్యం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబంతో పాటు, ఆయన పేషీ అధికారులు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Vidarbha Crisis | కాస్త నాకు ‘వైఫ్‌’ను వెతికి పెట్టండి.. శరద్‌పవార్‌కు విదర్భ యువ రైతు మొర!

హైదరాబాద్ ట్రెజరీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి ఒకరు గతేడాది హైకోర్టుకు వెళ్లారు. రిటైర్‌ అయి సంవత్సరం గడిచినా తనకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా తిప్పుకొటున్నారని ఆయన తన పిటిషన్‌లో విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత 8 వారాల్లో పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని తీర్పునివ్వగా, తెలంగాణ ఆర్థిక శాఖ ఆగమేఘాల మీద అమలు చేసింది. ఈ విషయం తెలిసిన రిటైర్డు ఉపాధ్యాయులు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, 8 వారాల్లో చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో స్కూల్ అసిస్టెంట్ ఎం.చంద్రారెడ్డి 2024 మే నెలలో పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలు దాటినా తనకు డబ్బులు చెల్లించడం లేదని తెలుపగా, వెంటనే చెల్లించాలని హైకోర్టు తీర్పు వచ్చింది. వారం రోజుల్లో తెలంగాణ ఆర్థిక శాఖ ఆయన బ్యాంకు ఖాతాలో రూ.52 లక్షలు జమ చేసింది. హైదరాబాద్ బండ్లగూడ మండలం జంగంమెట్ హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన యాదగిరి కూడా హైకోర్టుకు వెళ్లారు. 2024 జూన్ లో పదవీ విరమణ చేశానని, కుమార్తె పెళ్లి ఆగిపోయిందని తెలిపారు. 8 వారాల్లో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశించగా, తీర్పును అమలు చేశారు.

Group Vs Individual Helath Insurance : వ్యక్తిగత, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్: ఏది బెస్ట్?

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తరువాత గ్యాట్యుటీ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యూటేషన్, సరెండర్ లీవు సొమ్ములను తెలంగాణ ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉంటుంది. హోదాను బట్టి కనిష్టం రూ.40 లక్షల నుంచి గరిష్టంగా రూ.1 కోటి వరకు ఉంటాయి. తాము పదవీ విరమణ చేయడానికి నాలుగు నెలల ముందే ఏజీ కార్యాలయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తి వివరాలు అందచేస్తారు. అయినప్పటికీ ఈ ప్రయోజనాలు చెల్లించకుండా ఆర్థిక శాఖ సతాయింపులకు గురి చేస్తున్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు ప్రతి నెలా రూ.700 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఈ ఏడాది జూన్ నెలలో చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఒకటి రెండు సార్లు బకాయిలు విడుదల చేసి నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఆగస్టు నెలలో సమావేశమై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌ దారులకు చెందిన 206 సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మొదలు పెట్టి, జిల్లాలో బస్సు యాత్రలు చేపట్టి, చివరగా చలో హైదరాబాద్ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో తీర్మానించిన విధంగా ప్రతినెలా రూ.700 కోట్లు పెండింగ్ బకాయిలకు చెల్లించాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్ మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి లో భూములను భాగ్యనగర్ టీఎన్జీఓలకు కేటాయించాలని, కాంట్రిబ్యూటరీ ఫించన్ విధానాన్ని రద్ధు చేసి పాత ఫించన్ అమలు చేయాలని కోరారు. అయితే తమ నిరసన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఆ తరువాత ప్రకటించారు.

Read Also |

Student Union Elections | 38 ఏళ్ల త‌ర్వాత‌.. తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో స్టూడెంట్ యూనియ‌న్ ఎన్నిక‌లు..!
Jubilee Hills By Election | తెలంగాణలో ఉప ఎన్నికల సీన్ రివర్స్! నాడు బీఆరెస్‌.. నేడు కాంగ్రెస్!
Foreign Investments|పెట్టుబడుల యజ్ఞంలో..తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ!

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com