నాతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆదివారం గుంటూరులో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫైర్
విధాత : నాతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆదివారం గుంటూరులో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నేను ఎన్నికల ప్రచారానికి వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారని, తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
హెలిప్యాడ్ ధ్వంసం చేసిన వైసీపీ నాయకులపైన ఉగ్రవాద కేసులు పెట్టాలన్నారు. వైసీపీ నాయకులకు బానిసగా బ్రతికే వాళ్ళు అంటేనే ఇష్టమని, ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు అంటే నచ్చదని, మీ ఆత్మగౌరవం పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటానన్నారు. నేను మళ్లీ చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, జగన్ ఓటమి ఖాయమని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని , యువతకు ఉపాధి, విద్య అవసరాలు తీర్చలేదని,ఈ ప్రభుత్వంపై ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే కేసులు పెట్టారని, దాడులు, గోతులు తప్ప ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. కులాలకు అతీతంగా రాజకీయం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు.
రాంబాబుకు ఆయన అల్లుడే ఓటు వేయవద్దంటున్నాడు
మేము సినిమాలో డ్యాన్సులు చేస్తామని, మంత్రి పదవిలో ఉండి అంబటి రాంబాబు డ్యాన్సులు ఎలా చేస్తాడని ఎద్దేవా చేశారు. నాలాంటి వారిపైన దాడులకు పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని, అంబటి రాంబాబుకు ఆయన అల్లుడు మురళి కూడా ఓటు వెయ్యొద్దని చెపుతున్నాడని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలని, చెల్లికే ఆస్తులు ఇవ్వానివాడు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేస్తాడో ఆలోచించాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం టాక్స్ లు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 1939లో ఈప్రాంతంలో వేద పాఠశాల వుందని, అటువంటి ప్రాంతంలో అర్చకుల పై దాడులు చేస్తున్నారని, . బ్రాహ్మణ సంఘానికి అండగా వుంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కల్తీ మద్యం అమ్మిన వారిపై రౌడి షీట్ ఓపెన్ చేస్తామన్నారు.