బండ్ల గణేష్ రౌడీయిజం..బూతులు తిడుతూ మాస్ వార్నింగ్

కమెడీయన్, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల ఇటీవలి కాలంలో వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఇటీవల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా బండ్ల గణేష్ కి విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ తనయుడు కూడా ఓ వివాదంతో వార్తలలోకి ఎక్కాడు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్..ఈడీ స్వాధీనపర్చుకున్న ఇంటిని మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల గణేష్ తనయుడు హీరేష్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు
ఫిలింనగర్ రోడ్డునెంబర్–13 సైట్–2లోని ప్లాట్నెంబర్ 15–ఏలో నౌహీరా షేక్కు చెందిన ఇంట్లో 2023 నుంచి హీరేష్ అద్దెకు ఉంటుండగా, దానిని నౌహీరా అమ్మే ప్రయత్నం చేసింది. అయితే దానిని మేమే కొంటామని హీరేష్ మూడు కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. అయితే డబ్బు ముట్టజెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తనకు తెలిసిందని, దానిపై వివరణ అడిగితే మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలంటూ డిమాండ్ చేస్తుందని హీరేష్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయంలో బండ్ల గణేష్ కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా, అందులో తన ఆఫీస్ కు వచ్చిన ముస్లిం దంపతులతో గణేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
అంతేకాదు ఆయన బూతులు కూడా తిడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే బండ్ల గణేష్ నుండి తమకు తమకు ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. తమకు ఏమైనా అయితే, అందుకు బండ్ల గణేష్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఆయన మాపై దాడి చేయడమే కాక కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి భయబ్రాంతులకి గురయ్యేలా చేస్తున్నాడని అన్నారు. మా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఈడీ అనుమతి తప్పని సరి అని చెప్పిన కూడా ఆయన యూట్యూబ్లో హోమ్ టూర్ చేసి మరీ పెట్టాడని నౌహీరా పేర్కొంది. మరి దీనిపై బండ్ల గణేష్ మీడియా ముఖంగా ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి