బీజేపీ, బీఆరెస్ పార్టీలు తెలంగాణకు పట్టిన దరిద్రమని, మోదీ, కేసీఆర్ లోలోన ఒక్కటిగా ఉంటూ పైకి శత్రువుల్లా డ్రామాలు ఆడుతున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : బీజేపీ, బీఆరెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, మోదీ, కేసీఆర్ లోలోన ఒక్కటిగా ఉంటూ పైకి మాత్రం శత్రువుల్లా డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కుట్రలను బహిర్గతం చేసి, తరిమికొట్టడం ఖాయమని అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు ఇక్కడి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి, నలుగురు ఎంపీలు ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. జాతీయ హోదా తెచ్చేందుకు ప్రయత్నం చేయని కేసీఆర్ కూడా మోదీకి తొత్తుగా ఉంటూ ఈ ప్రాజెక్టుకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. ఇలాంటి నాయకులకు పాలమూరు జిల్లాలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. జిల్లాకు అన్నిరంగాల్లో ద్రోహం చేసిన ఈ రెండు పార్టీలు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పి, ఇక్కడ అడుగుపెట్టాలని సీఎం అన్నారు.
చీమలు పెట్టిన పుట్టలో ద్రోహులు
కేసీఆర్ను నమ్మి ఈ జిల్లా నుంచి ఎంపీగా గెలిపిస్తే ఒక్క పైసా కూడా జిల్లా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేదని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆయన ఇక్కడి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని గొప్పలు చెప్పి పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఉద్యమంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్లు కేసీఆర్ వచ్చి తానే తెలంగాణ తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టి బండకేసి బాది బొంద పెట్టినా ఇంకా తెలివి రాని దద్దమ్మ కేసీఆర్ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తన కమీషన్ల కోసం వాడుకొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో దేవాదుల, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు మనుగడ లేకుండా చేసిన ద్రోహి కేసీఆర్ అని అన్నారు.
ఏపీ సీఎంతో కేసీఆర్ లాలూచీ
ఏపీ ముఖ్యమంత్రితో లాలూచీ పడి కృష్ణ జాలాలు అప్పగించిన ఘనుడు కేసీఆర్ అని రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు, నాటుకోడి తిన్న కేసీఆర్ దద్దమ్మ.. తెలంగాణ రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. రోజూ 12 టీఎంసీల కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తరలించుకు పోతున్నా పట్టించుకోలేని, సోయి లేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు.
కొద్ది నెలల్లోనే రైతు రుణమాఫీ
కొద్ది నెలల్లో రూ.రెండు లక్షల రైతు రుణ మాఫి, వచ్చే నెల 15 వరకు రైతు బంధు రైతులకు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రూ.500లకే సిలిండర్, ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.