కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులే అనుకోలేదని, అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు.
విధాత: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతూ ద్రోహం చేస్తున్నాయని, ఏ రోజైనా గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరిరక్షించుకోవచ్చని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ మనకు ఎందుకో ఒకసారి ఆలోచించాలన్నారు. దేశంలో మోదీ హవా లేదు.. ఏం లేదని కొట్టిపారేశారు. మన కృష్ణానది నీళ్లన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో మన ప్రాజెక్టులు.. జల హక్కులు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో బీఆరెస్ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి, కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి ఇయ్యలేదని తీర్మానం పెట్టారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం ముఖాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమైనాయని, ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్కు 30 సీట్లు కూడా వచ్చేవి కావని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన రేవంత్రెడ్డి.. లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులే అనుకోలేదని, అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. అందరికీ అన్ని ఇస్తామని ఎన్నికల్లో చెప్పి.. ఇప్పుడు కొందరికే ఇస్తామంటున్నారని ఆరోపించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఆడబిడ్డలకి 2500 ప్రతినెలా ఇస్తామన్నారని, ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ.4,000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారని చెబుతూ.. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారని, వాళ్లందరూ నెలకు 2500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నాడని, కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయని, వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారన్నారు. 200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తానని చెప్పి, ఇప్పుడు కొందరికే అంటున్నారన్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరన్నారు.
శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు హామీల అమలుకు వందరోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నామని చెప్పారు. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే తమ పార్టీ పైన, పార్టీ అధినేత పైన అడ్డగోలుగా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరి కొద్ది రోజులు భరిస్తామని, తర్వాత వాళ్లు ఇటుకలతోని కొడితే తాము రాళ్లతోనే జవాబిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాలపాటు కష్టపడి పని చేశారన్నారు. వారందరికీ భవిష్యత్తు పైన భరోసా ఉంది నమ్మకం ఉందని చెప్పారు. పార్టీ నాయకులంతా కార్యకర్తలను ఒక్క సంవత్సరం కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారును వంద కిలోమీటర్ల స్పీడ్తో నడిపిద్దామని, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం తమకు ఉందన్నారు.