అవినీతికి పాల్పడుతూ దొరికిపోతున్న అధికారులపై ఐపీఎస్ అధికారిణి సుమతి చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
విధాత: రాష్ట్రంలో వరుసగా అవినీతి అధికారులు నిఘా సంస్థలకు చిక్కుతున్న వేళ ఐపీఎస్ అధికారిణి సుమతి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘నిఘా ఎప్పటికీ ఉంటుంది. చిక్కిన వారిపై చట్టం తన పని చేసుకొనిపోతుంది. చిక్కని వారు “వైట్ పేపర్” అని కాదు.. వారి సమయం ఆసన్నమవ్వలేదేమో ఇంకా!’అంటూ సుమతి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. తెలంగాణలో 270 కోట్లకు పైగా అక్రమాస్తులతో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీకి పట్టుబడిన ఘటనతోపాటు తాజాగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తనిఖీల్లో ఆమె వద్ద 15కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. వారే కాకుండా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వెలుగు చూశాయి.
అవినీతి తిమింగలాల కథ ఇలా ఉంటే జిల్లాల్లో నిత్యం ఎక్కడో ఒక అధికారి లంచం కేసుల్లో పట్టుబడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. సుమతి తన ట్వీట్లో చిక్కనివారు వైట్ పైపర్ కాదంటూనే.. ‘అవన్నీ పక్కన పెడితే.. నిజాయతీ అనేది విశ్వవాప్త విలువ. ఒక సమాజంగా ఇటువంటి సంఘటనలు మనల్ని పౌరులు, తల్లిదండ్రులు, పిల్లలు, యువకులు, సీనియర్ సిటీజన్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా గుర్తు చేస్తాయి. మనమంతా ఇక మన స్వంత పాత్రలలో మాటలలో, చర్యలలో నిజాయతీని పెంపొందించడానికి ప్రయత్నించాలి’ అని పేర్కొన్నారు. ఇటీవల ఏసీబీ డీజీ, ఐపీఎస్ సీవీ ఆనంద్ సైతం ప్రభుత్వంలోని రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల్లోనే ఎక్కువగా అవినీతి నెలకొందంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.