IRCTC Refund | దేశవ్యాప్తంగా అత్యధికంగా రైలులోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు తమ ప్రయాణం కోసం ముందస్తుగా రైలు టికెట్లను బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, టికెట్లకు భారీగా డిమాండ్ ఉంటున్నది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకేసారి చాలా మంది టికెట్ల కోసం ప్రయత్నించే సమయంలో సర్వర్ బిజీగా ఉండడంతో టికెట్లు బుక్ చేస్తున్న సందర్భంలో అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. కానీ, టికెట్ మాత్రం దొరకదు. అకౌంట్ నుంచి డెబిట్ అయిన డబ్బులను ఐఆర్సీటీసీ మళ్లీ రీఫండ్ చేస్తూ ఉంటుంది. అయితే, ఈ డబ్బులు జమయ్యేందుకు కనీసం మూడు నాలుగు రోజులు సమయం పడుతున్నది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ సిద్ధమవుతున్నది. రీఫండ్ అమౌంట్ను సాధ్యమైనంత త్వరగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
కేవలం కొద్ది గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. త్వరలోనే సర్వీసులను ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రీఫండ్ ప్రక్రియ చాలా నిదానంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సర్వీస్ రైల్వే అథారిటీ పేమెంట్స్ సిస్టమ్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఐఏసీటీసీ, సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బృందం రీఫండ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం యూజర్లు టికెట్ బుక్ చేసుకొని వెయిట్లిస్ట్లో ఉండి కన్ఫమ్ కాకపోతే ఆటోమేటిక్ రీఫండ్ అవుతుంది. అయితే, కన్ఫమ్ అయిన టికెట్ను క్యాన్సిల్ చేసిన సమయంలో క్యాన్సలేషన్ ఫీజులను ఐఆర్సీటీసీ వసూలు చేస్తుంటుంది. ఈ ఛార్జీలు స్లీపర్, థర్డ్ ఏసీ తదితర క్లాస్లను బట్టి మారుతూ ఉంటుంది.
అయితే, రైలు వెళ్లిపోయినా.. ప్రయాణించలేకపోతే రీఫండ్ కోసం టీడీఆర్ను ఫైల్ చేయాలి. టీడీఆర్ ఫైల్ తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసి.. రీఫండ్ చేస్తుంది. రైలు ప్రయాణానికి నాలుగు మంటల ముందు టికెట్ను క్యాన్సిల్ చేయకపోయినా.. టీడీఆర్ ఫైల్ చేయకపోతే టికెట్ డబ్బులు రీఫండ్ అయ్యేందుకు అవకాశం లేదు. ఐఆర్సీటీసీ నుంచి రీఫండ్ కావాలనుకుంటే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టిక్కెట్ను క్యాన్సిల్ చేసుకొని టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేయకపోతే డబ్బులు రీఫండ్ కావు. కొత్త సర్వీసులు అమలులోకి వస్తే అకౌంట్లోకి వీలైనంత త్వరగా డబ్బులు వచ్చేందుకు వీలుంటుంది. అయితే, ప్రస్తుతం అన్ని వ్యవహారాలన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్న నేపథ్యంలో కేవలం రీఫండ్లో ఎందుకు జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఐఆర్సీటీసీ రీఫండ్స్పై దృష్టి సారించి.. కేవలం గంటల్లోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నది.