చెన్నై: లోక్సభ ఎన్నికలకు ముందు హడావుడిగా సీఏఏ అమలుకు నిబంధనలను నోటిఫై చేశారని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) నాయకుడు కమల్హాసన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు దేశాన్ని చీల్చేందుకు, సామరస్యాన్ని దెబ్బతీసేందుకే తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకలోని తమిళులకు ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ తెచ్చిందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. సీఏఏ రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్న సమయంలో దీనిని తీసుకురావడాన్ని ఆయన ప్రశ్నించారు.
‘అణచివేతకు గురవుతున్న మతపరమైన మైనార్టీను రక్షించే ఉద్దేశంతోనే ఈ చట్టం తెచ్చినట్టయితే.. అదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంక తమిళులను దీని పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన రాష్ట్రాల్లో అగ్రభాగాన నిలిచింది’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. పుండుమీద కారం చల్లినట్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి విస్మరణకు గురవుతున్న మా ముస్లిం సోదరులు రంజాన్ మాసం తొలి రోజు ఈ విషాదకర విన్నారు’ అని వ్యాఖ్యానించారు. సీఏఏను తమ పార్టీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నదని స్పష్టం చేశారు. మొట్టమొదట తామే సుప్రీంకోర్టులో వ్యతిరేకించామని గుర్తు చేశారు.