What is CAA : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship (Amendment) Act ను) కేంద్రం ఎట్టకేలకు అమల్లోకి తెచ్చింది. నిన్నటి (మార్చి 11 2024) నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర సర్కారు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసిన మోదీ సర్కార్.. 2019 డిసెంబర్లో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. అప్పట్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ఈ చట్టం అమలును తాత్కాలికంగా పక్కన పెట్టింది.
దాదాపు ఐదేళ్ల విరామం తరవాత ఇప్పుడు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు సీఏఏ అమలును స్వాగతిస్తున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం ఈ ఎత్తు వేసిందని ఆరోపిస్తున్నాయి.
సవరణ చట్టంలో ఏముంది..?
పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే ఈ విషయంలో కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది. ఆ ప్రకారం.. 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. అంటే 2014 డిసెంబర్ లేదా అంతకుముందే భారత్లోకి వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వం కల్పిస్తారు.
అయితే, భారత్లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉండేది. మోదీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా సవరించింది. 2014 డిసెంబర్ కంటే ముందు భారత్కు వచ్చి గడిచిన 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లపాటు ఇక్కడ ఉన్నవారికి, లేదంటే గత ఏడాది కాలంగా భారత్లోనే నివసిస్తున్న వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ చట్టం పరిధి నుంచి గిరిజన ప్రాంతాలను మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను సీఏఏ నుంచి మినహాయిస్తున్నట్టు వెల్లడించింది.
భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో ఉన్నందున అసోంలోని కర్బీ అంగ్లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది. అంటే పొరుగు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి ఆయా గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి భారత పౌరసత్వం ఇవ్వరు. కాగా 2019 డిసెంబర్లో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన వెంటనే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నించింది. అయితే అందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో వెనక్కి తగ్గింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా పలువురు విపక్ష నేతలు సీఏఏ అమలును వ్యతిరేకించారు. ఎక్కడికక్కడ ఆందోళనలు లేవదీశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఆందోళనలకు వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ‘అప్పుడంటే కరోనా వచ్చి ఆగిపోయాం. కానీ ఈ సారి మాత్రం ఎవరూ ఈ చట్టం అమలు కాకుండా అడ్డుకోలేరు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పరోక్షంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలు వేశారు. కొంతమంది కావాలనే ముస్లింలను తప్పుదోవ పట్టించి సమస్యలు సృష్టించారని మండిపడ్డారు.