11 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ!

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, ఇతర కారణాలను న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించింది

11 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ!
  • నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌?
  • లోపాలు లేకుండా న్యాయ సలహాలు
  • కొలువులపై వేగం పెంచిన ప్రభుత్వం
  • నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, ఇతర కారణాలను న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించింది. పోలీస్‌, గురుకుల, స్టాఫ్‌ నర్స్‌ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. గ్రూప్‌-1 కూడా హైకోర్టు తీర్పును అనుసరించి గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఎలాంటి కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలతో, పెంచిన పోస్టులతో కొత్త నోటిషికేషన్‌ జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్‌ వివాదరహితంగా ఉన్నదని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కోర్టు కేసులతో మళ్లీ ప్రక్రియ ఆగుతుందనే ప్రచారాన్ని విశ్వసించవద్దని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి క్యాబినెట్‌లోనూ మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని వాగ్దానం చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే గత ప్రభుత్వం 5059 పోస్టులలో డీఎస్సీని విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు నిరసించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన ప్రకారం 13 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. అయితే ఆ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గత నోటిఫికేషన్‌ ను రద్దు చేసి, 11 వేల టీచర్‌ పోస్టులతో నాలుగైదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్‌ టీచర్లను రిక్రూట్‌ చేయనున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, పండిట్‌ పోస్టులు 611, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164, ఎస్జీటీ పోస్టులు 2,575 పోస్టులున్న సంగతి తెలిసిందే. ఈ సంఖ్యను పెంచి పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మెగా డీఎస్సీ వేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానున్నట్టు సమాచారం. ఈలోగానే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఈసారి డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.