మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు
విధాత, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందం కవిత నివాసంలో ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందనే అనుమానంతో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. సోదాల అనంతరం ఆమెకు అరెస్టు నోటీస్లు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రాత్రి 8.45నిమిషాలకు ప్రత్యేకంగా సిద్ధంగా చేసిన విమానంలో ఢిల్లీ తరలిస్తున్నారు. కవిత అరెస్టుతో ఆమె నివాసం వద్ద ఉన్న బీఆరెస్ శ్రేణులు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
అంతకుముందే అక్కడ భారీ ఎత్తున మోహరించిన కేంద్ర బలగాలు బీఆరెస్ శ్రేణులను అదుపు చేశాయి. కవిత అరెస్టు విషయం తెలుసుకున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసర భేటీ నిర్వహించి ఈ విషయమై అనుసరించాల్సిన వైఖరిపై చర్చలు సాగిస్తున్నారు. అటు కవిత అరెస్టుపై తనకు అధికారిక సమాచారం లేదని ఆమె న్యాయవాది సోము భరత్ తెలిపారు. అయితే కేసీఆర్ దీనిపై ఎప్పటికప్పుడు సమచారం తీసుకుంటున్నారని చెప్పారు. కవితను ఈడీ అదుపులోకి తీసుకుందన్న సమాచారం తెలుసుకున్న కేటీఆర్, హరీశ్రావులు హుటాహుటినా ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు.
కాగా.. వారిని కేంద్ర బలగాలు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. అధికారుల అనుమతి కోసం వారు గేటు బయట నిరీక్షించారు. కొద్దిసేపటి తర్వాతా అధికారులు వారిని లోనికి అనుమతించారు. విచారణ అధికారితో ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్లు వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్టు వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయమన్ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ నిలదీశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కావాలని శుక్రవారం వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అభ్యంతరాలను తోసిపుచ్చిన ఈడీ అధికారులు కవిత అరెస్టు విషయాన్ని ఆమె భర్తకు, కేటీఆర్, హరీశ్రావులకు తెలిపారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించేందుకు విమనాశ్రయంకు తీసుకెళ్లారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు హైదరాబాద్లో ఉండగానే కవితను అరెస్టు చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. ఒకవైపు కవిత అరెస్టు జరుగుతున్న సమయంలో ఇంకోవైపు నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్- 2024లో రాష్ట్రపతి హాజరవ్వగా, ప్రధాని మోదీ మల్కాజిగిరి బీజేపీ రోడ్ షోలో పాల్గొనడం గమనార్హం.
ఐదు గంటల పాటు తనిఖీలు
బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఈడీ, ఐటీ బృందాలు ఆకస్మిక సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 12మంది అధికారుల బృందాలు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించాయి. ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి కవిత నివాసంలో తనిఖీలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు చెందిన రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న మొత్తం 16ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తనిఖీల సందర్భంగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. బీఆరెస్ కార్యకర్తలు కూడా కవిత ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను శుక్రవారం సుప్రీంకోర్టు ఈనెల 19 కి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే ఈడీ, ఐటీలు కవిత నివాసంలో ఆకస్మిక సోదాలు చేపట్టి, ఆమెను అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దాడులు జరుగుతుండటంతో బీఆరెస్ కేడర్ భయాందోళనలకు గురవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు సీబీఐ కూడా కవితను నిందితురాలిగా పేర్కోంటూ విచారణకు హాజరుకావాల్సిందిగా సీఆర్పీ 41కింది నోటీస్లు జారీ చేయడం విదితమే.
ఢిల్లీ లిక్కర్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలంటూ ఇప్పటికే పలుమార్లు కవితకు ఈడీ, ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఆమె హాజరుకాలేదు. తనపై నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నాటి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రయోజనాలు ఆశించి, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్లు ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్లో కవిత ఒకరని ఈడీ ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలను కవిత తిరస్కరిస్తున్నారు. ఈడీ నోటీసులను మోడీ నోటీసులుగా అభివర్ణించారు.