చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లోనే తన టాలెంట్తో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ పేరు చెబితే ఆయన అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. పవన్ సినిమాలు చూసేందుకు తెగ ఆతృత కనబరుస్తుంటారు అయితే ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏకంగా ఐదారు సినిమాలకి సైన్ చేశారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాలని అనుకున్నారు.
అయితే ఇటు తెలంగాణ, అటు ఏపీ రాజకీయాలతో బిజీ వలన ఏడాది క్రితం ప్రారంభించిన సినిమాలను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) చిత్రం షూటింగ్ ఇప్పటికే కొంత జరిగిన, ఈ మూవీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అప్డేట్స్ కూడా లేవు. దీంతో ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. ఓజీ సినిమాను నిర్మిస్తున్న.. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తాజాగా స్పందించింది. ఇప్పుడు షూటింగ్ జరగట్లేదు.. అందుకే అప్ డేట్లు రావాలంటే ఇకా సమయం పడుతుందని… మీరు ఇక్కడ వేచి చూడకండి అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ పై బాలయ్య షో లో హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాప్ ఒట్టి వెకేషన్ మాత్రమే అని సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ అని హరీష్ తెలిపాడు. దీనితో ఆ సినిమా పట్ల అసలు తను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అనేది అర్ధం అవుతుంది.నాలుగు నెలల్లోనే ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ అస్సలు షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వలేరు. ఎన్నికలు పూర్తయ్యాకే పవన్ తిరిగి తనుకమిట్ అయిన చిత్రాలు పూర్తి చేయనున్నాడని తెలుస్తుంది.