TRS ఇక BRS: అధికారికంగా ప్రకటించిన CM KCR
టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలోఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇక నుంచి టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారనున్నది. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశారు. ఆ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం ఆ తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) […]

టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలోఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇక నుంచి టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారనున్నది.
పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశారు. ఆ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం ఆ తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు ప్రకటించారు. కేసీఆర్ పార్టీ పేరు మార్పును ప్రకటించగానే సభ్యులంతా చప్పట్లతో మద్దతు ప్రకటించారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు ప్రారంభమయ్యాయి. భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ మార్పుపై కేసీఆర్ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి లేఖ రాశారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీ పేరు మార్పుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు.
టీఆర్ఎస్ భేటీకి ఇతర రాష్ట్రాల నేతలు పలువురు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం హెఛ్డీ కుమారస్వామి, తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరొందిన వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్, రైతు సంఘం నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.
పార్టీ విస్తృతస్థాయి తీర్మానం చేసిన టీఆర్ఎస్, మౌలిక సవరణల ఉద్దేశాన్నిరేపు ఎన్నికల కమిషన్కు నివేదించనున్నారు. ఢిల్లీ వెళ్లి ప్రక్రియ వేగంగా జరిగేలా చూసే బాధ్యతలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బృందానికి అప్పగించారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే అధ్యక్షుడు తిరుమవలనన్ ప్రగతి భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ నేతలకు ప్రగతి భవన్లో విందు ఏర్పాటు చేశారు.

అంతకుముందు దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నామో వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ, గడిచిన 8 సంవత్సరాల్లో వృద్ధి రేటు ఎలా దెబ్బతిన్నదో వివరించారు. దేశంలో ఎన్నో వనరులు ఉన్నా.. ఇంకా అభివృద్ధి జరుగని నేపథ్యాన్ని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.
అనంతరం సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సర్వసభ్య సమావేశం ఆమోదముద్ర వేసింది. తర్వాత తీర్మానంపై కేసీఆర్ సంతకాలు చేశారు. అయితే, పార్టీ పేరు మార్పుపై సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ సమావేశంలో భారత్ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు. మరో వైపు పార్టీ సీనియర్ నేత వినోద్కుమార్, శ్రీనివాస్రెడ్డితో పాటు లీగల్ బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలువనున్నట్లు తెలుస్తున్నది.
తీర్మానం కాపీని ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరుపై అధికారికంగా ప్రకటించనున్నది.

