మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో గ్యాంగ్ లీడర్ చిత్రం ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90వ దశకంలో రికార్డులు తిరగరాసిన సినిమా రిలీజ్ అయి 3 దశాబ్దాలు దాటిన ఇప్పటికీ ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలు అభిమానుల మదిలో నిలిచి ఉన్నాయి. చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 32 యేళ్ల క్రితమే తెలుగులో రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చిరంజీవికి మరింత మాస్ ఇమేజ్ని పెంచడంతో పాటు ఆయన క్రేజ్ని కూడా పెంచింది. అయితే ఈ సినిమాకి ముందు చిరంజీవి నో చెప్పాడట. ఇది విన్నవారందరు ఆశ్చర్యపోక మానరు.
వివరాలలోకి వెళితే గ్యాంగ్ లీడర్ చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్న ఆయన డబ్బు డబ్బు డబ్బు చిత్రంతో దర్శకుడిగా మారడం ఆ తర్వాత చిరుతో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘హీరో’, ‘మగధీరుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించడం జరిగింది. అయితే చిరుతో సపరేట్ మూవీ చేస్తే బాగుంటుందని భావించిన బాపినీడు గ్యాంగ్ లీడర్ కథని చిరంజీవికి చెప్పారట. అయితే ఇది చిరంజీవిని అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో ఏ మాత్రం మొహమాటం లేకుండా గ్యాంగ్ లీడర్ సినిమా చేయనని అన్నాడట. దాంతో విజయ బాపినీడు ఈ కథని పరుచూరి బ్రదర్స్కి వినిపించారు. కథ విన్న తర్వాత అందులోని లోపాన్ని గుర్తించిన పరుచూరి బ్రదర్స్.. కథను మార్చేందుకు తమకి మూడు రోజుల సమయం కావాలని అడిగారు.
ఈ విషయాన్ని విజయ బాపినీడు చిరుకి చెప్పారు. అప్పుడు చిరు కూడా ఓకే అన్నారు. అయితే పరచూరి బ్రదర్స్ కథకి ఏమేం కావాలో అన్ని హంగులు అందులో ఉండేలా కథని రూపొందించారు. ఇక పరచూరి గోపాలకృష్ణ మార్చిన కథని చిరంజీవికి వినిపించడం, ఆయన వెంటనే ఓకే చేయడం జరిగింది. అయితే బాపినీడు రాసిన దాంట్లో లోపం ఏంటంటే..మురళీమోహన్తోపాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి చనిపోయేలా రాసాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో గ్యాంగ్ లేకుండా ఉంటే ఏం అర్ధం ఉంటుందది అని చిరంజీవి అన్నాడట. దాంతో ఆ పాయంట్ దగ్గర పరచూరి బ్రదర్స్ పలు మార్పులు చేశారు. వారు మార్పులు చేశాక చిరంజీవి సినిమా చేయడం, ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావడం మనం చూశాం. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే తెగ అలరిస్తూ ఉంటుంది.