వేధింపులతో మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లిలో శుక్రవారం రాత్రి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

తప్పిన ప్రాణాపాయం
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లిలో శుక్రవారం రాత్రి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం కోటపల్లి మండలం వెంచపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీలత శుక్రవారం కార్యాలయం నుంచి అక్కడే ఉన్న తన క్వార్టర్స్కు చేరుకున్నారు. అనంతరం శ్రీలత నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోగా..గమనించిన భర్త రాజేశ్ వెంటనే మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆమె తెలిపారు.
వెంచపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో బీహార్ కూలీలతో ప్లాంటేషన్ పనులు చేయిస్తుండగా, అందుకు డబ్బులు చెల్లించాలని బీహార్ లేబర్ కోరగా శ్రీలత ఉన్నతాధికారులు చెల్లిస్తారని పేర్కొన్నారు. డబ్బుల జాప్యంపై కూలీల బృందం సభ్యుడు జిల్లా అటవీ సంరక్షణాధికారి దృష్టికి తీసుకెళ్లాడు. కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. కోటపల్లి రేంజర్ రవి బీట్ ఆఫీసర్ శ్రీలతకు ఫోన్ చేసి డబ్బులు చెల్లింపు విషయమై మాట్లాడేందుకు తన కార్యాలయానికి రావాలని చెప్పి సాయంత్రం వరకు ఆయన కార్యాలయానికి రాకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా ఫోన్ చేసి, కార్యాలయానికి రావాలని రవి సూచించారు.
దీంతో శ్రీలత తిరిగి రేంజ్ కార్యాలయానికి మళ్లీ వెళ్లడంతో నీ వల్లే నాకు చెడ్డపేరు వచ్చిందని, అందుకే నిన్ను సస్పెండ్ చేస్తానని రేంజర్ బెదిరించినట్టు ఆమె తెలిపారు. కాగా మహిళా బీట్ ఆఫీసర్ శ్రీలత ఆత్మహత్యా యత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని రేంజర్ రవి పేర్కొన్నారు. తాను ఎవరినీ వేధించలేదని చెప్పారు. విధులకు సంబంధించి సూచనలు చేశానే తప్ప దూషించలేదన్నారు.