రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న
విధాత, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న మల్టీలెవల్ స్కీమ్ బాధితుడు నీరటి రవి కేసులో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురి మృతికి కారకులైన వారిని గుర్తించారు. వీరిలో ఐదుగురు విలేఖరులు కాగా, ఒక హోం గార్డు, ఇతరులు ఉన్నారు. అధిక రాబడులు ఇస్తామని హామీ ఇస్తూ కొంతమందిని మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్లో రవి చేర్చుకున్నాడు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన సమావేశంలో తిరుపతిరావు జీఎస్న్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ను రవికి పరిచయం చేశాడు. నిర్ణీత గడువులోగా స్కీమ్ సభ్యులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో డిపాజిటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి, తిరుపతిరావు స్పందించకపోవడంతో రవి ఇబ్బందుల్లో పడ్డాడు. ఒత్తిళ్లకు తాళలేక తన పిల్లలను చంపిన రవి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త మృతికి జర్నలిస్టుల బెదిరింపులే కారణమని మృతుడి భార్య నీరటి శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కీమ్ సమస్యలపై జర్నలిస్టులు తన భర్తను బెదిరించి 10 లక్షలు డిమాండ్ చేశారని, తన ఆభరణాలను అమ్మి జర్నలిస్టులకు 2.5 లక్షలు ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కోంది.
ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు కాల్ డేటాను విశ్లేషించి రవి తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను నిర్ధారించినట్లుగా తెలిపారు. ఐదుగురు జర్నలిస్టులు రవిని 25లక్షలు డిమాండ్ చేయగా, ఆయన 10లక్షలకు ఒప్పందం చేసుకుని, ఇందులో తన భార్య పుస్తెల తాడు అమ్మి 2.5లక్షలు వారికి చెల్లించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాతా రవి పిల్లలను చంపి తను చనిపోయాడని వివరించారు. హోంగార్డు నాగరాజు స్కీమ్లో భాగంగా రవి వద్ద పెట్టిన పెట్టుబడికి బదులుగా రవి భూమి పత్రాలను తీసుకుని మాటిగేజ్ పెట్టి 20లక్షలు తీసుకోవడం ద్వారా అతనిని మరింత కృంగదీశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు నిందితుల్లో ఏ1గా తిరుపతి రావు, ఏ2గా మంగలి శ్రీనివాస్-ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఏ3గా కురుమ శ్రీనివాస్-ఈనాడు రిపోర్టర్, ఏ4గా వడ్డే మహేష్-నమస్తే తెలంగాణ, ఏ5గా సిరిపురం శ్రీనివాస్ రెడ్డి-వార్తా పేపర్, ఏ6గా సంకే ప్రవీణ్ కుమార్-సాక్షి రిపోర్టర్, ఏ7గా ఆలూరు రాజు-హోంగార్డు, ఏ8గా మనీలా, ఏ9గా రామకృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు