ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు మృతి

- ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
విధాత: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో రాష్ట్ర పోలీసు దళానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. భద్రతా సిబ్బందిని ముందే పసిగట్టిన నక్సల్స్ కాల్పులు జరిపారు.
భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా, ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు కనిపించాయి. ఇన్సాస్ రైఫిల్, ఒక 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలోకి పారిపోయిన మిగతా నక్సల్స్ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.