MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్ : ఎమ్మెల్సీ కవిత ఫైర్

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కి నోటీసులు
90శాతం పంప్ హౌజ్ లు కట్టిన మెగా కృష్ణారెడ్డిని పిలిచే దమ్ము లేదు
ఏపీ జలదోపిడీని అడ్డుకోని కాంగ్రెస్, బీజేపీలు
బనకచర్లను ఆ రెండు పార్టీలు ఆపాలి
జాగృతి అంటే ఎందుకంత భయం
మహాధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్
విధాత, హైదరాబాద్ : తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్..అదొక రాజకీయ కమిషన్ అని కవిత విమర్శించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ధ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని…కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని మండిపడ్డారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అందుకే నోటీసులు ఇచ్చారా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని..ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్, 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చని..కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు..కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు అని కవిత పేర్కొన్నారు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని గుర్తు చేశారు.
మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం అని, 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు అని కొనియాడారు. కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని విమర్శించారు.
మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవడం లేదు
కేసీఆర్ ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని..దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారని..కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలిని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందన్నారు.
ఏపీ జలదోపిడిని అడ్డుకోని కాంగ్రెస్, బీజేపీలు
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని, గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని ఆరోపించారు.
8 మంది ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి ఆ పార్టీ కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని విమర్శించారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని కోరారు.
జాగృతి అంటే ఎందుకంత భయం
గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారని..ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నదని ప్రశ్నించారు. ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.