Adilabad విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉచిత కరెంట్ ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు […]
Adilabad
విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉచిత కరెంట్ ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో రైతులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ సప్లై చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులకు 3 గంటలు కరెంట్ చాలని వ్యాఖ్యలు చేయడం రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. గతంలో లాగా కరెంట్ సమస్యలు కానీ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల సమస్య లేదని, వ్యవసాయానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర రైతన్నల మొహంలో నవ్వు కనపడుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్ రెడ్డికి మతిభ్రమించిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి రైతు కష్టాలు ఏం తెలుసు? ఏనాడైనా అరకపట్టి దుక్కి దున్నిండా అని, వ్యవసాయంపై రేవంత్ రెడ్డిది అవగాహన రాహిత్యం అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు, అప్పుల బాధలతో రైతన్న చితికిపోయారని కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిన రైతన్నల ఆత్మహత్యలు చూశామని తెలిపారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాల్నా… 3 పంటలకు సాగునీరు, కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాల్నా రైతులు నిర్ణయించుకోవాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, 3 గంటలు వద్దు 3 పంటలు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.