Kodada: తెలంగాణలో BJPకి కాంగ్రెస్ B-టీం.. పేపర్ల లీకేజీ ఆ రెండు పార్టీల కుట్రే: మంత్రి జగదీష్రెడ్డి
9ఏండ్లలో లక్షా 32 వేల 649 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే 23 వేల మంది ఉద్యోగులను క్రమబద్దీకరించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసిఆర్ నిప్పు.. ముట్టుకుంటే భస్మమే కోదాడ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి విధాత: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిజెపికి బీ-టీంగా పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య […]

- 9ఏండ్లలో లక్షా 32 వేల 649 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే
- 23 వేల మంది ఉద్యోగులను క్రమబద్దీకరించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్
- ముఖ్యమంత్రి కేసిఆర్ నిప్పు.. ముట్టుకుంటే భస్మమే
- కోదాడ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిజెపికి బీ-టీంగా పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడుగా రాహుల్ గాంధీని లోక్ సభ నుండి వెలి వేసి అక్రమంగా ఇంటిని ఖాళీ చేయిస్తే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయి లేక పోగా బిజెపిని అంటకాగి తిరుగుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి కుట్రతో రాష్ట్రంలో లీకేజీల పర్వానికి తెర లేపాయన్నారు. వాస్తవానికి దేశంలో నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిందే బిజెపి, కాంగ్రెస్ లని ఆయన దుయ్యబట్టారు. అటువంటి పార్టీలు నిరుద్యోగులకు వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో లక్షా 32 వేల 649 ఉద్యగాలను భర్తీ చేశామన్నారు. ఏక కాలంలో 23 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టగానే లీకేజీ కుట్రలకు తెర లేపి నిరుద్యోగులలో గందరగోళం సృష్టించారని ఆయన మండిపడ్డారు.
90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వంగానే జిల్లా వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ్యులు సొంత ఖర్చులతో ఆయా ఉద్యోగాల అర్హతా పరీక్షల కోసమై శిక్షణా తరగతులు నిర్వహించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు పూర్వం దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన మీదట ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందన్నారు. అదే ఎన్నికల ప్రచారంలో దేశంలో 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అధికారంలోకి వచ్చిందే తడవుగా ఉద్యగాల భర్తీ ఉంటుందంటూ మాయ మాటలు చెప్పిన మోడీ నిరుద్యోగులను నిండా ముంచారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేసిన విధంగా కేంద్రం ఈ తొమ్మిదేళ్లలో సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున భర్తీ చేసి ఉంటే తెలంగాణ నుండి ఇప్పటికే తొమ్మిది కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో లక్షా 32 వేల 649 ఉద్యగాలను భర్తీ చేసినట్లు అధికారికంగా గణాంకాలు వెల్లడిస్తున్నామన్నారు. అదే విధంగా మాతో పాటు బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కనీసం పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అంటూ ఆయన బిజెపి నేతలను నిలదీశారు.
25 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యంగా బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్లో కనీసం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు నిరూపిస్తారా అంటూ ఆయన బిజెపికి సవాల్ విసిరారు. గుజరాత్ సంగతి సరేసరి అంటూ ఆయన బిజెపి పై వ్యంగాస్త్రాలు సంధించారు. అటువంటి బిజెపికి ఇక్కడి కాంగ్రెస్ బీ-టీం గా మారి లీకేజీల పర్వానికి తెర లేపిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పైగా దేశాన్ని బిజెపి మధ్య యుగంలోకి తీసుకు పోతుందా అన్న అనుమానాలు రేకిత్తిస్తున్నారని ఆయన చెప్పారు. శనివారం రాత్రి అటు మీడియా ఇటు పోలీసుల కళ్లెదుటే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉదంతాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఉదహరించారు.
బిజెపి, కాంగ్రెస్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వణుకు పుడుతుందని అందుకే లీకేజీ డ్రామాలకు తెర లేపి లబ్ది పొందే యత్నం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే నిప్పు కణిక అని ముట్టుకోవడం కాదు.. జోలికి వస్తేనే భస్మం అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్, బిజెపి లను హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.