Telangana | అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు.. సిద్దమవుతున్న ఎన్నికల కమిషన్
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్ష రిటర్నింగ్ అధికారుల జాబితా రూపొందించండి ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలి జూన్ నుంచి ఈవీఎంల తనిఖీ అన్ని స్థాయిలలో పోల్ అధికారులకు శిక్షణ పోల్ శాతాన్ని పెంచడానికి ఎస్వీ ఈఈపీ కార్యకలాపాలు విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సిద్దమవుతున్నది. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి వీలుగా […]

- ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్ష
- రిటర్నింగ్ అధికారుల జాబితా రూపొందించండి
- ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలి
- జూన్ నుంచి ఈవీఎంల తనిఖీ
- అన్ని స్థాయిలలో పోల్ అధికారులకు శిక్షణ
- పోల్ శాతాన్ని పెంచడానికి ఎస్వీ ఈఈపీ కార్యకలాపాలు
విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సిద్దమవుతున్నది. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి వీలుగా ఇప్పటి నుంచే యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నది. ఈ మేరకు శనివారం ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) చెందిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్కు వచ్చింది.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలని, జాబితా పక్కగా ఉండేలా చూడాలని అధికారులను కేంద్ర ఎన్నకల సంఘం అధికారి నితీష్ వ్యాస్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలను పకడ్భంధీగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల (ఆర్ఓ) సమగ్ర జాబితాను సిద్ధం చేసి అప్డేట్ చేయాలని ఆయన సీఈఓ వికాప్ రాజ్ను ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) మొదటి స్థాయి తనిఖీని జూన్ 1 వతేదీ నుండి ప్రారంభించాలని రాష్ట్ర స్థాయి అధికారులను ఈసీఐ అధికారుల బృందం ఆదేశించింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షల అనంతరం జిల్లాల్లో ఉంచినట్లు తెలిపారు.
అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల కోసం రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహించాలని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేయాలని ఈసీఐ అధికారుల బృందం సీఈఓను ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులకు పటిష్టమైన శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పోల్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు అవినాష్ కుమార్, సంజయ్ కుమార్, రవికిరణ్, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.