ధర్మాన్ని నిలిపేందుకు బీజేపీకి ఓటేయండి: ఈటల
దేశంలో ధర్మాన్ని నిలిపేందుకు మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలు బీజేపీకి ఓటేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోరారు

- కేంద్రంలో వచ్చేది మోదీ ప్రభుత్వమే
- ప్రధాని సహాకారంతో అభివృద్ది చేస్తా
- మల్కాజిగిరిలో గెలిపించండి
- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్
విధాత, హైదరాబాద్ : దేశంలో ధర్మాన్ని నిలిపేందుకు మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలు బీజేపీకి ఓటేయాలని మాజీ మంత్రి, ఈటల రాజేందర్ కోరారు. శనివారం ఆయన ఆల్వాల్ ఆత్మీయ సమ్మేళనంకు హాజరై మాట్లాడారు. నా పార్టీ గుర్తు మీకు తెలుసని, గత 22ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న నేనేంటో మీకు తెలుసన్నారు. అతి పెద్దదైన ఈ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతాయో అని ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయని, కానీ ప్రజలు తలుచుకుంటే ధర్మంగా ఓట్లు వేసి బీజేపీని గెలిపిస్తారని నాకు తెలుసన్నారు. ప్రధాని మోదీ కేవలం ప్రజల ఆశీర్వాదాన్నే కోరుతున్నారని, మీరంతా నన్ను ఆశీర్వదించి కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు ప్రధాని మోదీ అని, ఒక దేశం, ఒకే చట్టం అనే పద్దతిని అమలు పరిచారని కొనియాడారు. ఎంతో కాలంగా ఉన్న కాశ్మీర్ సమస్యను సునాయాసంగా పరిష్కరించారని, మహిళా రిజర్వేష్ బిల్లు తెచ్చారని, రామమందిరం నిర్మింపచేశారని గుర్తు చేశారు. గతంలో ప్రపంచంలో ఏడవస్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు మోదీ పాలనలో నాలుగవ స్థానానికి చేరిందన్నారు. టెక్నాలజీ అతి వేగంగా అభివృద్ధి చెందిందని, మేకిన్ ఇండియా నినాదంతో అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ దేశంలో వచ్చే ప్రశ్నే లేదని, ఐదు దశాబ్దాల పైన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ఐదేళ్ళ కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులను మార్చారో మనకు తెలుసన్నారు. మళ్లీ ఇండియా కూటమి పేరుతో అతుకుల బొంతగా పార్టీలను కూడగట్టుకుని అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలనుకుంటే అది అవివేకమని, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే పార్లమెంట్ సభ్యులకు నిధులు అందుతాయన్నారు. ప్రధాని మోదీకి భారత ప్రజలందరూ కుటుంబమని గుర్తు చేశారు. దేశంలో గతంలో 75 ఎయిర్ పోర్టులు ఉంటే, నేడు 150 ఎయిర్ పోర్టులు ఏర్పడ్డాయని, నేషనల్ హైవేస్ అతి వేగంగా నిర్మాణం జరిగాయని, ఒకచోట నుండి మరొక చోటుకు అతితక్కువ సమయంలో వెళ్లగలుగుతున్నామని తెలిపారు. కరోనా కాలంలో ప్రధాని మోదీ చూపిన చొరవ, ధైర్యం ఎంతో గొప్పవని, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ను అందించిన ఘనత ఆయనదేనని, ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని పేర్కోన్నారు.